పానిక్ బైయింగ్ మాత్రమేనా?: అధికారులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నది ఒకటే.. “నిజమైన కొరత లేదు”. ఏపీ సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల భాస్కర్.. “పానిక్ చెందకండి, సరఫరా సాధారణంగానే ఉంది” అన్నారు. “రూమర్స్, హోర్డింగ్ వల్ల సమస్య” వచ్చింది అని కలెక్టర్లు అంటున్నారు. తెలంగాణలో కూడా డీలర్ల అసోసియేషన్, ప్రభుత్వం “సప్లై చైన్ సాధారణం, స్టాక్ సరిపడా ఉంది” అని ప్రకటించాయి. అయినా ఏపీలో రైతులు, ఆక్వా ఫార్మర్లు, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ట్రాక్టర్లు, లారీలు సరిగా నడిచే పరిస్థితి లేదు. రోడ్డు ప్రయాణాలు ఆలస్యం అవుతున్నాయి. చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు రోజువారీ ఆదాయం కోల్పోతున్నారు. రైతులకు సేద్యం, పంట కోతలు ఆలస్యమవుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ వైపు చూస్తే.. బస్సులు, లారీలు ఆగిపోతున్నాయి. ధరల పెరుగుదలకు ఇదో అవకాశంగా మారుతోంది. హైదరాబాద్, విజయవాడలో ఆఫీస్ వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. బ్లాక్ మార్కెటింగ్ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.



