రూ.993 పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర…రాహుల్ గాంధీ ఆగ్రహం


రూ.993 పెరగడమంటే ఒకరోజులో నమోదైన అత్యధిక పెరుగుదల అన్న రాహుల్ గాంధీ
వాణిజ్య సిలిండర్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేవలం మూడు నెలల్లోనే వాణిజ్య సిలిండర్ ధరను 81 శాతం పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య సిలిండర్ ధరను ఒక్కరోజులోనే రూ.993 పెంచారని, ఇది కచ్చితంగా ఎన్నికల బిల్లు అని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయని తాను ముందే హెచ్చరించానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అందుకు నిదర్శనమే నేడు వాణిజ్య సిలిండర్ ధర పెంపు అని తెలిపారు. రూ.993 పెరగడమంటే, ఇది ఒకరోజులో నమోదైన అతిపెద్ద పెరుగుదల అని ఆయన అన్నారు. ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు ధర రూ.1,380 పెరిగిందని ఆరోపించారు. అంటే గత మూడు నెలల కాలంలో 81 శాతం పెరుగుదల నమోదైనట్లు చెప్పారు.వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం వల్ల ఈ ప్రభావం చిన్న చిన్న వ్యాపారులపై తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీ దుకాణాలు, చాయ్-టిఫిన్ డబ్బాలు, హోటళ్లు, బేకరీలు, మిఠాయి దుకాణాలు తదితర వాటిపై ప్రభావం పడుతుందని అన్నారు. తద్వారా ఇది సామాన్యులకు కూడా భారంగా మారుతుందని అన్నారు.నేటి ధరల పెంపుతో 19 కేజీల వాణిజ్య సిలిండర్ రూ.3 వేలకు పైగా ధర పలుకుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *