ధర్మస్థల వివాదంతో సంబంధం లేదు: ప్రకాశ్ రాజ్ స్పష్టీకరణ


కర్ణాటకలోని ధర్మస్థల వివాదంలో తన ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలను ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు రూ. 200 కోట్లతో కుట్ర జరిగిందని, అందులో తనకూ పాత్ర ఉందని ముసుగు ధరించిన చిన్నయ్య అనే వ్యక్తి చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుధవారం బెంగళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.ఈ వివాదం గురించి తనకు ముందస్తు సమాచారం లేదని, తన పేరును కావాలనే ఇందులోకీ లాగుతున్నారని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. సామాజిక కార్యకర్త గిరీశ్ మట్టన్నవర్ తనను సంప్రదించి, చిన్నయ్య అనే వ్యక్తి తనతో మాట్లాడాలని ఆశిస్తున్నట్లు తెలిపారని వెల్లడించారు. తమిళంలో మాట్లాడిన చిన్నయ్య తనను కలవాలని కోరగా, తాను నిరాకరించినట్లు చెప్పారు. అనంతరం అతను పంపిన వాయిస్ మెసేజ్‌ను సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) చీఫ్ ప్రణబ్ మొహంతికి పంపి, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించానని వివరించారు.

ధర్మస్థల ఆలయ ప్రతిష్టను భంగపరచడానికి కేరళ నుంచి రూ. 200 కోట్లు అందాయని, ఈ కుట్రలో ప్రకాశ్ రాజ్ భాగస్వామిగా ఉన్నారని ఆరోపిస్తూ చిన్నయ్య కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ప్రకాశ్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన పేరును వివాదాల్లోకి నెడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఈ కేసుపై ప్రస్తుతం కోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కేవలం పిటిషన్‌లో పేరు ఉన్నంత మాత్రాన ఎవరూ దోషులుగా పరిగణించబడరని కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే గతంలోనే వ్యాఖ్యానించారు. కాగా, సిట్ తన దర్యాప్తు నివేదికను జూన్ 29న హైకోర్టుకు సమర్పించనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *