త్రిబుల్ ఐటీ లో సీట్లు సాధించిన బిఎస్సార్ మున్సిపల్ విద్యార్థినులకు మంత్రి అభినందనలు


విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ మున్సిపల్ పాఠశాలకు చెందిన 15 మంది పదవ తరగతి బాలికలు నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు IIITల్లో సీట్లు సాధించడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో త్రిబుల్ ఐటీ కు ఎంపికైన విద్యార్థినులను, అలాగే పాఠశాల హెడ్ మాస్టర్ జ్యోతిలక్ష్మిను మంత్రి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ… గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రతిభతో ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు సాధించడం సమాజానికి ప్రేరణ అని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఏవైనా సరే, పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. మా సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో ధర్మవరం నియోజకవర్గానికి చెందిన 25 మంది యువతులకు లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ ద్వారా ఉచిత శిక్షణతో పాటు వసతి సౌకర్యం అందిస్తున్నామని తెలిపారు.విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ…. మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా నేను, మా సంస్కృతి సేవా సమితి ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాం. మీరు బాగా చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి. భవిష్యత్తులో మీరు మరింత ముందుకు వెళ్లేందుకు అవసరమైన సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉంటాం అని హామీ ఇచ్చారు. విద్యార్థుల విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషి కూడా అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ తో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *