నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా) : నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై వేధింపులు, ఆమె సహోద్యోగులపై దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం,
జూన్ 16న రాత్రి సుమారు 7 గంటలకు డ్యూటీకి వెళ్తున్న ఓ యువతిని అప్పన్నపాలెం గ్రామ సమీపంలో ఇద్దరు వ్యక్తులు అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై ప్రశ్నించిన ఆమెతో కలిసి పనిచేస్తున్న ఇద్దరు సహోద్యోగులపై దాడి చేసి, వారి సెల్ఫోన్ను ధ్వంసం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితులు కుప్పరాల హరి (30), లారీ డ్రైవర్, పెద్దబొడ్డేపల్లి మరియు పొన్నపు కుమార్ అలియాస్ ఏసు (42), థెరిసా కాలనీ, పెద్దబొడ్డేపల్లిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
కుప్పరాల హరిపై రౌడీషీట్తో పాటు గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, మహిళలపై వేధింపులు, అసభ్య ప్రవర్తన, దాడులు లేదా ఇతర నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాస్, సీఐ గఫూర్ హెచ్చరించారు.
The post మహిళపై వేధింపులు.. ఇద్దరు నిందితులు అరెస్ట్ appeared first on Visalaandhra.


