Last Updated:
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓవైపు వేసవి తాపం 45 డిగ్రీలు దాటిపోవడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ఈపరిస్థితుల్లో వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓవైపు వేసవి తాపం 45 డిగ్రీలు దాటిపోవడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ఈపరిస్థితుల్లో వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది. రానున్న ఐదు రోజులు పాటు ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు పాటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి ,పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
రానున్న మూడు రోజులు అకాల వర్షాలకు ఆస్కారం ఉన్నందున రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. సాయంత్రం 6 గంటల నాటికి మార్కాపురం జిల్లా పొదిలిలో 37మిమీ, ఎన్టీఆర్ జిల్లా కుంటముక్కలలో 22మిమీ, నంద్యాల జిల్లా మెట్టుపల్లిలో 10.5మిమీ వర్షపాతం నమోదైందన్నారు..
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. గురువారం నెల్లూరు జిల్లా గూడూరులో ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రత 45.8 డిగ్రీలు రికార్డయిందని* ఆయన పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో 28 మండలాలు, వైఎస్సార్ కడపలో 26, తిరుపతిలో 25, నెల్లూరులో 25, ప్రకాశంలో 22, మార్కాపురంలో 15, నంద్యాలలో 14, చిత్తూరు 13, గుంటూరులో 11 మండలాలు మొత్తంగా 28 జిల్లాలకు గాను 20 జిల్లాల పరిధిలోని 216 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపి 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
శుక్రవారం (01-05-26) రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు పార్వతీపురంమన్యం జిల్లా బలిజపేట, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, సీతంపేట, సీతానగరం మండలాలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో (09) తీవ్రవడగాల్పులు , మరో 49 మండలాల్లో వడగాల్పులు ఉన్నాయి అన్నారు. విజయనగరం జిల్లాలో 10, మన్యం 6, పోలవరం 5, కాకినాడ 3, తూర్పుగోదావరి 3, ఏలూరు 3, ఎన్టీఆర్ 4, గుంటూరు 3, పల్నాడు 11, మార్కాపురం 1 మండలాల్లో (49) వడగాలులు* ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh


