Last Updated:
ఆ నిండు ప్రాణం బలవన్మరణానికి పాల్పడింది. బహ్రెయిన్లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Suicide: రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. తండ్రి లేని లోటును భర్తీ చేస్తూ, వయసుపైబడిన తల్లికి చేదోడు వాదోడుగా నిలవాలని, తోడబుట్టిన వాళ్లను ప్రయోజకులను చేయాలని కలలు కన్న ఆ యువతి కడలి దాటి వెళ్ళింది. కానీ విధి వంచించింది. విదేశీ గడ్డపై ఉపాధి దొరికినా, మనశ్శాంతి కరువైందో ఏమో తెలియదు కానీ, ఆ నిండు ప్రాణం బలవన్మరణానికి పాల్పడింది. బహ్రెయిన్లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈనాడు కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన వర్ధనపు కవిత (23) అనే యువతి ఉపాధి నిమిత్తం నాలుగు నెలల క్రితమే బహ్రెయిన్కు వెళ్లింది. కవిత తండ్రి గతంలోనే మరణించడంతో ఇంటి బాధ్యత మొత్తం ఆమె భుజాల మీద పడింది. తల్లి లూథియా కూడా గత కొన్ని ఏళ్లుగా కువైట్లో గృహ కార్మికురాలిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంట్లో ముగ్గురు తోబుట్టువుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారికి ఆసరాగా నిలవాలనే సంకల్పంతో కవిత తెలిసిన వారి ద్వారా బహ్రెయిన్లోని ఒక ఇంట్లో పనిలో చేరింది.
గత ఏప్రిల్ 23న కవిత తను నివసిస్తున్న గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన ఇంటి యజమాని వెంటనే కువైట్లో ఉన్న ఆమె తల్లి లూథియాకు ఫోన్ ద్వారా సందేశం పంపారు. అయితే ఆ సందేశం అరబిక్ లేదా ఆంగ్లంలో ఉండటం వల్ల ఆమెకు అర్థం కాలేదు. అనుమానం వచ్చి ఆమె ఆ మెసేజ్ను చిట్టవరంలో ఉన్న తన బంధువులకు పంపించగా, కవిత మరణవార్త వెలుగులోకి వచ్చింది. ఒక్కగానొక్క కూతురు ఇలా విగతజీవిగా మారిందని తెలియడంతో తల్లి లూథియా, గ్రామంలోని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
కవిత మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించడం ఒక పెద్ద సవాలుగా మారింది. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు పశ్చిమాసియా దేశాల్లో (ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు) నెలకొన్న యుద్ధ మేఘాల వల్ల విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో మృతదేహం తరలింపు ఆలస్యమైంది. ఈ క్రమంలో బహ్రెయిన్లోని తెలుగు సంఘాల ప్రతినిధులు బొక్క గిరిబాబు, సత్యనారాయణ తదితరులు చొరవ తీసుకుని, యజమానితో మాట్లాడి అవసరమైన ఖర్చులను భరింపజేశారు.
కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఇతర ప్రజా ప్రతినిధుల సహకారంతో ఎట్టకేలకు కవిత మృతదేహం గురువారం నరసాపురం చేరుకుంది. తమ కళ్లముందే తిరిగిన యువతి శవపేటికలో తిరిగి రావడాన్ని చూసి గ్రామస్తులంతా చలించిపోయారు. కుటుంబ సభ్యుల రోదనల మధ్య కవిత అంత్యక్రియలు అశ్రునయనాలతో ముగిశాయి.
ఉపాధి కోసం వెళ్లిన నాలుగు నెలలకే కవిత ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుందనేది ఇంకా మిస్టరీగానే ఉంది. అక్కడ ఆమెపై ఏదైనా వేధింపులు జరిగాయా లేదా వ్యక్తిగత కారణాలా అనేది తెలియాల్సి ఉంది. గల్ఫ్ దేశాలకు వెళ్లే గృహ కార్మికుల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



