విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఇందులో జిల్లా సెషన్స్ జడ్జి స్థాయి కోర్టులు 12, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులు 25, సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులు 59 ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులు 176 ఉండగా, అదనంగా కేటాయించిన 12తో కలిపి ఆ సంఖ్య 188కి చేరనుంది. అలాగే సివిల్ జడ్జి (సీనియర్ డివి జన్) కేడర్ స్ట్రెంత్ ప్రస్తుతం 138 ఉండగా, అదనంగా కేటాయించిన 25తో కలిపి సంఖ్య 163కు చేరనుంది. సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) సంఖ్య 329 ఉండగా అదనంగా కేటాయించిన 59 తో కలిపి ఆ సంఖ్య 388 కి చేరనుంది. మరోవైపు కొత్తగా ఏర్పాటు కానున్న కోర్టుల్లో సిబ్బంది నియామకం నిమిత్తం 1,730 పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు న్యాయ శాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా జిల్లా జడ్జి కోర్టులు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం, కృష్ణాజిల్లా గుడివాడ, గుంటూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లా ప్రొద్దుటూరు, గాజువాక, నర్సీపట్నంలో ఒక్కో కోర్టు, అలాగే, విశాఖ నగరంలో మరో 4 కొత్త కోర్టులు ఏర్పాటు కానున్నాయి. సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులు అనంతపురం 3, తూర్పు గోదావరి 1, గుంటూరు 2, కర్నూలు 2, కృష్ణా 6, నెల్లూరు 1, విశాఖ 6, పశ్చిమ గోదావరి 3, కడప 1, సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులు అనంతపురం 14, చిత్తూరు 6, తూర్పు గోదావరి 3, గుంటూరు 2, కృష్ణా 3, కర్నూలు 17, ప్రకాశం 7, శ్రీకాకుళం 1, విశాఖ 2, పశ్చిమ గోదావరి 4 ఏర్పాటు కానున్నాయి.
The post రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టులు appeared first on Visalaandhra.


