ఫొటో షూట్ చేస్తూ లోయలో పడిన యువకుడు
పూణె: వివాహబంధంతో ఒక్కటై నూరేళ్లు కలిసి బతకాల్సిన ఓ యువజంట జీవితాలను ప్రీ వెడ్డింగ్ సరదా విషాదభరితంగా మార్చింది. ఫొటో షూట్ చేస్తూ నవ వరుడు మృతి చెందాడు. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాబోయే నవవధువు పుట్టినరోజు కావడంతో వరుడు కేతన్ విశాల్ అగర్వాల్ (26) గురువారం ఉదయం ఆమెను సరదాగా చారిత్రాత్మక లోహగఢ్ కోటకు తీసుకువెళ్లాడు. వారి వెంట వారి సన్నిహిత మిత్రులను తీసుకువెళ్లారు. కోట వద్ద ఆ సమయంలో పొగమంచు కమ్ముకుని ఉండటం, యువతి ఫొటోలు తీస్తున్న కేతన్ హోరుగాలికి పట్టుతప్పి 400 అడుగుల లోతు లోయలో పడి అక్కడికక్కడే మరణించాడు. పూణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్ తన కుటుంబ స్థిరాస్తి వ్యాపార కంపెనీలో డైరెక్టరుగా ఉన్నాడు. నవంబరులో జరిగేలా నిశ్చయించిన ఈ జంట పెళ్లి కోసం ఉదయ్పుర్ ప్యాలెస్ బుక్ చేశారు.


