Last Updated:
AP Weather: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో మూడు రోజులు వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు మెరుపులు, మత్స్యకారులు సహా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశంలోకి ప్రవేశిస్తూ వాతావరణ పరిస్థితుల్లో మార్పులు తీసుకువస్తున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. మే 18, 2026 నాటికి నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతంలోని కొన్ని భాగాలు, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని ప్రాంతాలు, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలు, మొత్తం అండమాన్ & నికోబార్ దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు వెల్లడించారు. దీంతో దక్షిణ భారత రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. మరోవైపు దక్షిణ లక్షద్వీప్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి ప్రారంభమైన ద్రోణి లేదా గాలుల అంతరాయం కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించింది. ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎల్లుండి పరిస్థితి మరింత తీవ్రంగా ఉండొచ్చని, గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి. ఈరోజు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు గాలుల వేగం మరింత పెరిగి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి మరింత బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని హెచ్చరించారు.
రాయలసీమ ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం కొనసాగుతుందని, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపారు. రైతులు, మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, ఓపెన్ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా గమనించాలని సూచించారు. బలమైన గాలులు, అలల తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో సముద్ర ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మరోవైపు ఈ వర్షాలతో ఎండ తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉండటంతో ప్రజలు ఉపశమనం పొందే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
May 18, 2026 10:26 PM IST


