Last Updated:
మంత్రాలయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ బలంగా ఢీకొన్నాయి. ఈ దారుణ ఘటనలో 8 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ బలంగా ఢీకొన్నాయి. ఈ దారుణ ఘటనలో 8 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురు బాధితులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ముగ్గురు ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ఐదుగురు మహిళలతో పాటు ఒక చిన్నారి కూడా ఉన్నారు. వీరంతా కర్ణాటక రాష్ట్రం చిక్మగళూరుకు చెందినవారు. వీరంతా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్పించి వైద్యులతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనపై వెంటనే స్పందించిన ఆయన.. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడి ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని మంత్రి అధికారులను స్పష్టంగా ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



