Last Updated:
దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి పండరీపురం, అకోలా వరకు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రకటించింది, ఉమ్మడి మహబూబ్ నగర్ భక్తులకు తిరుమల ప్రయాణం సులభం కానుంది
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త అందించింది. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న సర్వీసులను రైల్వేశాఖ ఇప్పుడు రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుమల వెళ్లే భక్తులకు రైలు ప్రయాణం మరింత సులభతరం కావడమే కాకుండా, అందుబాటులో ఉండే రైళ్ల సంఖ్య కూడా పెరిగింది. తిరుపతి ప్రధాన రైల్వే స్టేషన్ (TPTY) మరియు రేణిగుంట జంక్షన్ (RU)కు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల నుండి నిత్యం అనేక రైళ్లు అందుబాటులో ఉండగా, ఇప్పుడు మరిన్ని సర్వీసులు తోడవ్వడం విశేషం. ఇప్పటికే సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, తిరుమల ఎక్స్ప్రెస్ వంటి రైళ్లు నిత్యం వేలమంది భక్తులను క్షేమంగా తిరుమలకు చేరవేస్తున్నాయి.
ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా భక్తుల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ దక్షిణ మధ్య రైల్వే సరికొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ను ప్రకటించింది. తిరుపతి నుండి మహారాష్ట్రలోని పండరీపురానికి, అలాగే తిరుపతి – అకోలా (17439) మధ్య కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. గతంలో కేవలం రద్దీ సమయాల్లో నడిపిన ప్రత్యేక రైలును ఇప్పుడు క్రమబద్ధీకరిస్తూ రైలు నంబర్ 17437ను మే 16 నుండి, రైలు నంబర్ 17438ను మే 17 నుండి నిరంతరాయంగా నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ రైళ్లలో ఏసీ మరియు స్లీపర్ క్లాస్ వంటి అన్ని రకాల అధునాతన సదుపాయాలు ఉండటంతో ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.
ఈ కొత్త రైలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రముఖ స్టేషన్లైన షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి మరియు జోగులాంబ గద్వాల జిల్లా స్టేషన్లలో ఆగుతూ వెళ్లనుంది. దీనివల్ల ఉమ్మడి జిల్లాలోని ప్రతి మూల నుండి తిరుమలకు వెళ్లే భక్తులకు ఇకపై ప్రతి వారం ప్రయాణం మరింత చేరువ కానుంది. ఈ రైలు ప్రారంభం అవుతుందనే వార్త వినగానే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మీదుగా తిరుమలకు వెళ్లడానికి భక్తులకు కేవలం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మాత్రమే ఏకైక ఆధారంగా ఉంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రోజువారీ సర్వీసు అయినప్పటికీ, పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా అది సరిపోవడం లేదని, ప్రయాణం అంత సౌకర్యవంతంగా ఉండటం లేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా వీక్లీ రైలు అందుబాటులోకి రావడంతో రద్దీ తగ్గుతుందని, భక్తులు తమ తిరుమల యాత్రను మరింత ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవచ్చని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirumala,Chittoor,Andhra Pradesh



