Last Updated:
రాయదుర్గం కోటలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, కర్ణాటకకు చెందిన పదేళ్ల శ్రీ స్వర జాహ్నవితో ఆచారబద్ధంగా కళ్యాణం, వేడుక సోషల్ మీడియాలో వైరల్
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పట్టణంలో జరిగిన ఓ వివాహ వేడుక గురించి విని అందరూ షాక్ అయ్యారు. పదేళ్ల బాలికకు పెళ్లి” అనే వార్త వినగానే ఇది బాల్య వివాహమా? అనే అనుమానం సహజమే. కానీ ఈ పెళ్లి వెనుక ఉన్నది చట్టవిరుద్ధమైన వివాహం కాదు.. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఓ ఆధ్యాత్మిక సంప్రదాయం. భక్తి, విశ్వాసం, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ అపూర్వ ఘట్టం ప్రతి ఏడాది రాయదుర్గంలో అత్యంత వైభవంగా జరుగుతుంది.
రాయదుర్గం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ ప్రాంతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది శ్రీవారి కళ్యాణోత్సవం. అయితే ఈ కళ్యాణంలో ప్రత్యేకత ఏమిటంటే.. పదేళ్ల బాలికను వధువుగా ఎంపిక చేసి స్వామివారితో వివాహ తంతు నిర్వహించడం. ఈ ఆచారాన్ని స్థానికులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు.
ఈ ఏడాది కర్ణాటకకు చెందిన పదేళ్ల చిన్నారి శ్రీ స్వర జాహ్నవిని వధువుగా ఎంపిక చేశారు. సంప్రదాయ బద్ధంగా అలంకరించిన చిన్నారిని మార్కండేయ స్వామి ఆలయం నుంచి మేళతాళాలు, వేదఘోషల మధ్య ఊరేగింపుగా రాయదుర్గం కోటలోని శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ వేదమంత్రోచ్ఛరణల నడుమ జీలకర్ర బెల్లం పెట్టించి, కన్యాదానం నిర్వహించి, కళ్యాణ తంతును ఘనంగా పూర్తి చేశారు.
ఈ వేడుకలో అత్యంత భావోద్వేగభరిత ఘట్టం మంగళసూత్ర ధారణ. పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించిన అనంతరం, పద్మావతి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కట్టడం సంప్రదాయంలో ముఖ్యమైన భాగంగా కొనసాగుతోంది. ఈ ఆచారాన్ని చూసేందుకు రాయదుర్గం ప్రజలతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
పద్మశాలి వంశంలోని అరవ తెగకు చెందిన బాలికతో స్వామివారికి కళ్యాణం జరిపిస్తే ఆ చిన్నారికి భవిష్యత్తులో ఉత్తమ గుణవంతుడైన భర్త లభిస్తాడన్న విశ్వాసం భక్తుల్లో బలంగా ఉంది. అందుకే ఈ వేడుకను ఎంతో పవిత్రంగా భావిస్తూ తరతరాలుగా కొనసాగిస్తున్నారు. ఈ అరుదైన సంప్రదాయంపై ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నాం అని తెలిపారు. ఇక తమ కుమార్తెకు స్వయంగా దేవదేవుడితో కళ్యాణం జరగడం తమ కుటుంబానికి గొప్ప అదృష్టమని చిన్నారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
భక్తి, విశ్వాసం, సంప్రదాయం కలిసిన ఈ అపూర్వ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. ఇలాంటి ఆచారం ఇప్పటికీ కొనసాగుతుందా? అంటూ చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఇది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల గొప్పతనానికి నిదర్శనమంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Anantapur,Andhra Pradesh
May 07, 2026 10:19 PM IST


