Last Updated:
గోదావరి జిల్లాల్లో మండే ఎండలతో కోనసీమ కొబ్బరిబోండాలు, పుచ్చకాయలకు భారీ డిమాండ్, బొండం ధర 40 నుంచి 50 రూపాయలు, డీహైడ్రేషన్ నివారణకు ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు
వేసవి ఎండలు మళ్లీ భగ్గుమంటుండటంతో గోదావరి జిల్లాల్లో కోనసీమ కొబ్బరిబోండాలకు భారీ డిమాండ్ నెలకొంది. ఒక్క కోనసీమ బొండం తాగితే చాలు.. ఎండ దెబ్బ మర్చిపోతారు అన్నట్టుగా ప్రస్తుతం ఈ భారీ సైజు కొబ్బరిబోండాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముప్పావు లీటర్ వరకు నీరు ఉండే ఒక్కో బొండం అక్షరాలా రూ.40 నుంచి రూ.50 వరకు అమ్ముడవుతున్నా కొనుగోలుదారులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. సిటీలతో పోలిస్తే గోదావరి జిల్లాల్లో ధరలు ఇంకా తక్కువగానే ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమ అంటేనే కొబ్బరి తోటలకు పెట్టింది పేరు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులు కొబ్బరి సాగు చేస్తుంటారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు కొబ్బరి బొండాలు ఎగుమతి అవుతుంటాయి. అయితే కోనసీమ నుంచి వచ్చే కొబ్బరిబోండాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో లభించే సాధారణ బొండాలతో పోలిస్తే కోనసీమ బొండాల్లో నీటి పరిమాణం ఎక్కువగా ఉండటమే కాకుండా రుచి కూడా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు.
సాధారణ బొండంలో నీరు ఎంత ఉంటుందో చెప్పలేం.. కానీ కోనసీమ బొండంలో మాత్రం ఖచ్చితంగా అత్యధిక నీరు ఉంటుంది అంటూ వ్యాపారులు చెబుతున్నారు. భానుడి వేడిమి నుంచి ఉపశమనం పొందాలంటే ఒక్క బొండం చాలు అంటూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి వెంటనే చల్లదనం ఇవ్వడంతో పాటు నీరసం తగ్గించడంలో కొబ్బరి నీళ్లు కీలకంగా పనిచేస్తుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వీటిని కొనుగోలు చేస్తున్నారు.
గంగాభవాని కొబ్బరిబోండాలను తలపించేలా భారీ సైజులో కనిపిస్తున్న కోనసీమ బొండాలు ప్రస్తుతం కాకినాడ, పిఠాపురం, ప్రత్తిపాడు, సామర్లకోట ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. గత కొన్ని రోజులుగా వర్షాలు కురిసినా మళ్లీ ఎండలు మండిపోవడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పరిస్థితి ఎంతగా ఉందంటే.. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రానికి కొబ్బరిబోండాలు పూర్తిగా అయిపోతున్నాయి. చీకటి పడితే బొండం దొరకని పరిస్థితి కూడా కనిపిస్తోంది.
డిమాండ్ పెరగడంతో కొబ్బరిబోండాల ధరలు కూడా అమాంతం పెరిగాయి. సాధారణంగా రూ.30కి అమ్మే బొండాలు ఇప్పుడు రూ.50 వరకు విక్రయిస్తున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం కోసం ప్రజలు వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా ఎండల్లో డీహైడ్రేషన్ నుంచి రక్షించడంలో కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇక కొబ్బరిబోండాలకు సమానంగా పుచ్చకాయల అమ్మకాలు కూడా గోదావరి జిల్లాల్లో జోరుగా సాగుతున్నాయి. శరీరానికి అధికంగా వాటర్ లెవెల్ అందించే ఫ్రూట్ కావడంతో మార్కెట్లలో పుచ్చకాయలకు కూడా భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఈసారి రెండు రకాల పుచ్చకాయలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. కూరగాయల మార్కెట్లతో పాటు రోడ్ల పక్కన కూడా పుచ్చకాయల విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. ఏదేమైనా ఈ మండే ఎండల్లో ప్రజలకు ఉపశమనం కలిగించడంలో కోనసీమ కొబ్బరిబోండాలు, పుచ్చకాయలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వ్యాపారులు, వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


