వాషింగ్టన్: ప్రముఖ వార్తా సంస్థ సీఎనఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ (87) మరణించారు. 24 గంటల పాటు టీవీలో వార్తలు ప్రసారం చేయడం ద్వారా ఆయన విప్లవం సృష్టించారు. ఆయన బుధవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు టర్నర్ ఎంటర్ప్రైజెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఓహియోలో పుట్టిన అట్లాంటాకు చెందిన వ్యాపారవేత్త టెడ్ టర్నర్ ‘ది మౌత్ ఆఫ్ ది సౌత’గా పేరుగాంచారు. సూటిగా మాట్లాడే నైజం ఆయనకు ఈ పేరు తెచ్చిపెట్టింది. కెప్టెన్ ఔట్రేజియస్, టెరిబుల్ టెడ్గానూ ఆయనను పిలిచేవారు. టెడ్ యునైటెడ్ నేషన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కూడా. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలు ఉండరాదని పోరాడారు. సంఘ సేవకుడు. పర్యావరణం గురించి పిల్లలకు అవగాహన కల్పించేందుకు కెప్టన్ ప్లానెట్ అనే కార్మూన్ను ఆయన రూపొందించారు. టెడ్ టర్నర్ డెమెన్షియాతో బాధపడుతున్నట్లు 2018 సెప్టెంబరులో వెల్లడైంది. తన తండ్రి బిల్బోర్డు బిజినెస్ను టెడ్ టర్నర్ చేపట్టిన తర్వాత ఆయన బిలియనీర్గా ఎదిగారు. 1970లో టెలివిజన్ స్టేషన్ కొనుగోలు చేశారు. అమెరికా మీడియా, వినోద రంగంలో అత్యంత ప్రముఖుడిగా నిలిచారు.
The post సీఎనఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ మృతి appeared first on Visalaandhra.


