Last Updated:
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో బుధవారం జరిగిన ఈ ఘోర ప్రమాదం నాలుగు నిండు ప్రాణాలను బలిగొనడమే కాకుండా, పదుల సంఖ్యలో ప్రజలను గాయాలపాలు చేసింది.
Kadiri: అపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే మానవత్వం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇల్లు తగలబడుతోందని భావించి మంటలు ఆర్పేందుకు వెళ్లిన స్థానికులు, ఊహించని రీతిలో జరిగిన భారీ పేలుడుకు చిక్కారు. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో బుధవారం జరిగిన ఈ ఘోర ప్రమాదం నాలుగు నిండు ప్రాణాలను బలిగొనడమే కాకుండా, పదుల సంఖ్యలో ప్రజలను గాయాలపాలు చేసింది.
ఈనాడు కథనం ప్రకారం.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన వెంకన్న అనే వ్యక్తి గత పదేళ్లుగా తన కుటుంబంతో కలిసి కుమ్మరవాండ్లపల్లిలో అద్దెకు ఉంటున్నాడు. ఇతను వృత్తిరీత్యా రాళ్లను పేల్చే (బ్లాస్టింగ్) పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో, నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో జిలెటిన్ స్టిక్స్, డిటొనేటర్లను తన నివాసంలోనే నిల్వ ఉంచాడు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఆ నిల్వల నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ రావడం మొదలైంది. ప్రమాదాన్ని పసిగట్టిన వెంకన్న కుటుంబ సభ్యులు వెంటనే కేకలు వేస్తూ ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు.
వెంకన్న ఇంటి నుంచి వస్తున్న దట్టమైన పొగను చూసిన ఇరుగుపొరుగు వారు, గ్యాస్ సిలిండర్ లీకై ఇల్లు తగలబడుతోందని భావించారు. ఆ మంటలను ఆర్పేందుకు విశ్వనాథ్ రెడ్డి (52), మాబున్నీసా (52), మధుసూదన్ (40), అస్లాం బాషా (50) అనే వ్యక్తులు బకెట్లతో నీళ్లు పట్టుకుని లోపలికి వెళ్లారు. వారు లోపలికి వెళ్లిన క్షణాల్లోనే ఇంట్లో నిల్వ ఉన్న జిలెటిన్ స్టిక్స్ పెనుశబ్దంతో పేలిపోయాయి. ఈ పేలుడు తీవ్రతకు ఆ ఇల్లు పూర్తిగా నేలమట్టమవ్వడమే కాకుండా, లోపలికి వెళ్లిన నలుగురు అక్కడికక్కడే శరీర భాగాలు ఛిద్రమై దుర్మరణం పాలయ్యారు.
పేలుడు ధాటికి కుమ్మరవాండ్లపల్లి దద్దరిల్లిపోయింది. చుట్టుపక్కల ఉన్న మరో ఐదు ఇళ్లు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. శకలాలు సుమారు వంద మీటర్ల మేర ఎగిరిపడటంతో కాలనీలో ఉన్న మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సంభవించిన ప్రాంతంలో ఎక్కడ చూసినా రక్తపు ముద్దలు, విగతజీవులుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం స్మశానాన్ని తలపించింది. క్షతగాత్రులను వెంటనే కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే ఎస్పీ సతీష్ కుమార్, జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రాథమిక విచారణ అనంతరం, జనావాసాల మధ్య అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచినందుకు గాను వెంకన్న, అతని కుమారుడు సంజీవ్పై పోలీసులు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
సాయం చేద్దామని వెళ్లిన వారు శవాలై తిరిగిరావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన జనావాసాల మధ్య పేలుడు పదార్థాల నిల్వపై మరోసారి ఆందోళనను రేకెత్తించింది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



