Last Updated:
రాజంపేట కళాంజలి సాంస్కృతిక సంస్థ వెటరన్ జర్నలిస్ట్ అవార్డ్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది, జూన్ 25 చివరి తేదీగా నిర్ణయించి 35 మంది సీనియర్ జర్నలిస్టులను సత్కరించనుంది
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిజం రంగంలో విశేష సేవలందించిన వెటరన్ జర్నలిస్టులకు కళాంజలి సాంస్కృతిక సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ.. సమాజానికి సేవలందించిన సీనియర్ జర్నలిస్టులను గౌరవించేందుకు ప్రతిష్టాత్మక వెటరన్ జర్నలిస్ట్ అవార్డ్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాజంపేట కళాంజలి సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్. కళాంజలి వెల్లడించారు. ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు.
సమాచార రంగంలో ప్రతిభ చూపడమే కాకుండా.. సామాజిక సేవలు, సాంస్కృతిక, సాహిత్య, నాటక, పర్యాటక, కళారంగాల్లో విశేష కృషి చేసిన జర్నలిస్టులు ఈ అవార్డులకు అర్హులని నిర్వాహకులు తెలిపారు. కేవలం వార్తలకే పరిమితం కాకుండా సమాజంపై ప్రభావం చూపిన వ్యాసాలు, కథనాలు రాసిన జర్నలిస్టులను ప్రత్యేకంగా గుర్తించి సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన 35 మంది జర్నలిస్టులకు బిరుదు, మెమెంటో, అవార్డు సర్టిఫికెట్లను అందజేయనున్నట్లు వెల్లడించారు.
దరఖాస్తుదారులు తమ దరఖాస్తుతో పాటు కనీసం 10 ముద్రిత పత్రిక క్లిప్పింగ్స్ జతపరచాలని సూచించారు. స్వీయ రచనలు, సామాజిక సమస్యలపై ప్రభావం చూపిన వ్యాసాలను కూడా పరిశీలిస్తామని తెలిపారు. గతంలో అందుకున్న అవార్డుల ఫోటోలు, సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు కూడా జత చేయవచ్చని చెప్పారు. జర్నలిస్టుగా పని చేసిన అనుభవం, పని చేసిన మీడియా సంస్థల వివరాలు, సమాజానికి ఇచ్చే సందేశం వంటి అంశాలను కూడా దరఖాస్తులో పొందుపరచాలని సూచించారు.
అభ్యర్థులు ఆధార్ కార్డు, అక్రిడేషన్ కార్డు లేదా ఫ్రీ బస్ పాస్ జిరాక్స్, గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా జతపరచాలని తెలిపారు. పేర్ల రిజిస్ట్రేషన్ నిమిత్తం రూ.500 ఫోన్పే ద్వారా చెల్లించి దరఖాస్తు పంపాలని పేర్కొన్నారు. ఫోన్పే నంబర్ 9490884300గా వెల్లడించారు. పూర్తి దరఖాస్తులను veteranjournalistawards@gmail.com మరియు kalanjaliawards@gmail.com కు మెయిల్ చేయడంతో పాటు.. మిగిలిన పత్రాలను కొరియర్ లేదా తపాలా ద్వారా రాజంపేటలోని కళాంజలి సాంస్కృతిక సంస్థ కార్యాలయానికి పంపించాలని సూచించారు.
ఈ అవార్డుల ద్వారా జర్నలిస్టుల కృషిని గౌరవించడమే కాకుండా.. సమాజానికి సేవ చేస్తున్న సీనియర్ పాత్రికేయులకు గుర్తింపు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కళాంజలి నమో వికసిత భరతమాత అవార్డు, కళాంజలి వందే భరతమాత అవార్డు”, “కళాంజలి రాజహంస అవార్డు, కళాంజలి జాతిపిత మహాత్మ గాంధీ స్మారక అవార్డు”, “కళాంజలి సంఘమిత్ర జీవన స్రవంతి అవార్డు వంటి పలు ప్రతిష్టాత్మక అవార్డులను ఈ సందర్భంగా ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
జూన్ 25 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని సీనియర్ జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కళాంజలి సంస్థ పిలుపునిచ్చింది. జర్నలిజం రంగంలో నిస్వార్థంగా పనిచేసిన వారికి ఇది ఒక అరుదైన గౌరవంగా మారనుందని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh



