Last Updated:
Viral Incident: కాకినాడ తునిలో దివ్యాంగురాలు చందక గౌరీ శ్రీకు పింఛన్ నిలిపివేతతో ఇబ్బందులు, కలెక్టర్ భరోసా, యువనేత దాడిశెట్టి శ్రీనివాస్ నెలనెలా ఆర్థిక సహాయం ప్రకటించారు
సమాజంలో ఎంతమంది బంధువులు, రక్త సంబంధీకులు ఉన్నప్పటికీ.. ఆపద కాలంలో ఆదుకునే గుణం, కరుణ జాలి లేకపోతే ఆ బంధాలన్నీ వ్యర్థమే అనిపించే సంఘటన ఒకటి కాకినాడ జిల్లాలో వెలుగుచూసింది. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని బత్తాయి తోట ప్రాంతానికి చెందిన చందక గౌరీ శ్రీ అనే దివ్యాంగురాలి కన్నీటి గాథ సామాజిక మాధ్యమాల్లో అందరినీ కదిలించింది. తనకు వస్తున్న ప్రభుత్వ పింఛను నిలిపివేయడంతో ఆమె తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి లేదా గ్రీవెన్స్ సెల్లో ఆమె స్వయంగా జిల్లా కలెక్టర్ ముందు మోకాళ్లపై నిలబడి, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన ఆవేదనను పంచుకుంది.
“నాకు అక్క, తమ్ముడు, చెల్లి.. ఇలా అందరూ ఉన్నా నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు సార్. కనీసం బతకడానికి, నా రోగానికి మందులు కొనుక్కునేందుకు ఒక్క రూపాయి డబ్బులు లేవు. పింఛనే నాకు ఆధారం, అది తీసేస్తే నేను ఎలా బ్రతకాలి సార్?” అంటూ కలెక్టర్ ఎదుట ఆమె పెట్టిన బావురుమన్న ఏడుపు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హృదయవిదారక దృశ్యానికి స్పందించిన జిల్లా కలెక్టర్ సైతం చలించిపోయారు. ఆమెను ఓదారుస్తూ.. “బాధపడొద్దు, నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది” అంటూ సానుకూలంగా భరోసా కల్పించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే పింఛన్లు నిలిపివేస్తుంటారు. చందక గౌరీ శ్రీ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఆమె నివాసంలో ఉంటున్న ఒక మహిళకు ఇటీవలే ఏఎన్ఎమ్ (ANM) ఉద్యోగం వచ్చింది. ఈ సాంకేతిక కారణాన్ని చూపిస్తూ అధికారులు ఆమెకు వస్తున్న దివ్యాంగుల పింఛన్ను తొలగించారు. ఈ విషయంపై బాధితురాలు స్పందిస్తూ.. “ఇంట్లో ఎవరికో ఉద్యోగం వస్తే నన్ను చూస్తారా సార్? నా పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. నా తోబుట్టువులు నన్ను చూసే పరిస్థితి లేదు” అంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. సాంకేతిక నిబంధనల వల్ల నిజమైన లబ్ధిదారులు ఎలా నష్టపోతున్నారో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ.
ప్రభుత్వం నుంచి తదుపరి సహాయం అందుతుందా లేదా, అధికారులు ఎప్పుడు స్పందిస్తారు అనేది పక్కన పెడితే.. ఈ కన్నీటి గాథ కాకినాడ పార్లమెంటు పరిధిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువనేత, సామాజిక సేవా తత్పరుడు దాడిశెట్టి శ్రీనివాస్ దృష్టికి వెళ్ళింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా మానవత్వంతో స్పందించారు.
వెంటనే దాడిశెట్టి శ్రీనివాస్ తన ప్రధాన అనుచరులు సేవా టీమ్ను బాధిత దివ్యాంగురాలు గౌరీ శ్రీ నివాసానికి పంపించారు. అక్కడికి చేరుకున్న శ్రీనివాస్ టీమ్ సభ్యులు.. ప్రస్తుత అత్యవసర ఖర్చుల నిమిత్తం, ముఖ్యంగా ఆమె మందుల కొనుగోలు కోసం కొంత మొత్తంలో తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతటితో ఆగకుండా, యువనేత దాడిశెట్టి శ్రీనివాస్ తరపున ప్రతి నెలా ఆమెకు ఇదే విధంగా నిశ్చితమైన నగదు సహాయం అందేలా శాశ్వత ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఊహించని సహాయంతో బాధితురాలి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



