Last Updated:
Success Story: సాయం చేసే గుణం అందరికి ఉండదు. సేవ చేయాలనే ఆలోచన అందరికి తట్టదు. కాని విజయవాడకు చెందిన భార్గవ్ వెంట్రాప్రగడ అనే సాధారణ ఉద్యోగి వందలాది మందికి అమ్మలా అన్నం పెడుతూ పుణ్యాన్ని మూటగట్టుకుంటున్నారు.
Success Story: స్థాయి ఎంత పెరిగినా .. ఎంత దుర్బరమైన జీవనం గడుపుతున్న మనిషి ప్రాణంతో ఉండాలంటే కనీస అవసరం ఆహారం. అందుకే పట్టెడన్నం కోసం అలమటించే వారు ఎంతో మంది ఇంకా ఈ భూమి మీద ఉన్నారు. అలాంటి వాళ్ల ఆకలి కేకలు వింటే ఎంతటి వారైనా చలించిపోతారు. ఆకలి తీర్చడం కోసం ఆపన్నహస్తం అందిస్తారు. మరీ ముఖ్యంగా మురికివాడలు, బస్తీల్లో నివసించే వందలాది మంది ఇప్పటికి పూట గడవక దేహి అని చేతులు చాస్తున్న పరిస్థితులు నెలకున్నాయి. అలాంటి వారి కడుపు నింపడమే పని పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. పేదలు, దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్న వారు, నిరాశ్రయులకు నిత్యం వందలాది మందికి భోజనం పెట్టే మహత్తరమైన కార్యానికి శ్రీకారం చుట్టారు విజయవాడకు చెందిన భార్గవ్ వెంట్రాప్రగడ అనే సాధారణ ఉద్యోగి. ఆయన మొదలుపెట్టిన ఈసేవా కార్యక్రమం ఇప్పుడు నగరాల్లో కూడా పస్తులుండే వందలాది మందికి కడుపు నిండా భోజనం పెట్టే స్థాయికి చేరింది ఈ సేవా కార్యక్రమం. విజయవాడ హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ పేరుతో ఇప్పటికి పేదల పాలిట పెన్నిదిగా మారింది.
సాయం చేసే గుణం అందరికి ఉండదు. సేవ చేయాలనే ఆలోచన అందరికి తట్టదు. కాని విజయవాడకు చెందిన భార్గవ్ వెంట్రాప్రగడ అనే సాధారణ ఉద్యోగి వందలాది మందికి అమ్మలా అన్నం పెట్టే పుణ్యాన్ని మూటగట్టుకున్నారు. సుమారు 15 సంవత్సరాల కిందట చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు నివారించేందుకు కంకణం కట్టుకున్న భార్గవ్ మురికివాడల్లో, బస్తీల్లో నివసించే వారి దగ్గరకు వెళ్లి వాళ్ల సమస్యలు ఏంటో..? వాళ్లకు ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేశారు భార్గవ్. ఆ పరిస్థితుల్లో బస్తీవాసులు తనను దగ్గరకు రానివ్వకపోయినప్పటికి అక్కడ నివసించే వారికి కడుపు నిండా భోజనం లేదనే విషయాన్ని గుర్తించారు భార్గవ్. తాను మంచి చేయాలనే సత్సంకల్పంతో వారికి చేరువై జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలుసుకొని తగిన విధంగా సూచనలు ఇస్తూ వారికి మార్గదర్శిగా మారారు. నిరక్షరాస్యత, పేదరికం లాంటి పరిస్థితులు వెక్కిస్తున్న వారి కోసం భార్గవ్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. తాను చేస్తున్న ఐటి ఆర్గనైజేషన్ ఉద్యోగాన్ని సైతం పక్కనపెట్టి పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా మార్చుకొని 300 మంది సహాయకులతో ప్రతిరోజు నిరుపేదలకు, భిక్షాటన చేసే వారికి కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమాన్ని నిర్వరామంగా కొనసాగిస్తూ వస్తున్నారు.
2017 కృష్ణపట్నం పోర్టులో జూనియర్ ఐటి ఆఫీసర్గా పని చేసిన భార్గవ్ వెంట్రప్రగడ ఆ తర్వాత మచిలీపట్నం, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో ఐటీ రంగాల్లో పనిచేశారు. ఒకవైపు తన పని చేస్తూనే ఈ సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చారు. భార్గవ్ తాజాగా తన ఉద్యోగాన్ని సైతం వదులుకొని తనకు ఎంతో సంతృప్తిని ఇస్తున్న ఈ సేవలోనే పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా 350 మంది నిరుపేదలు, ఆహారం కోసం అలమటించే వారికి భోజనం అందజేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్నం, హైదరాబాద్ వంటి భాగ్య నగరాలతో పాటు రూరల్ ప్రాంతాల్లో జరిగే ఫంక్షన్లో మిగిలిపోయిన ఫుడ్ సేకరించి ఆ సమీప ప్రాంతంలో ఉన్న ప్రజలకు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని భార్గవ్ తెలిపారు. దాదాపుగా ఈ పది సంవత్సరాల్లో 320 టన్నుల ఆహార పదార్ధాలను సేకరించి పేదలకు పంచిపెట్టడం జరిగిందన్నారు. ప్రతి నెలకు రెండు టన్నుల ఆహారం సేకరించి అవసరమైన వారికి అందజేస్తున్నట్లుగా లోకల్18కి తెలిపారు.
తాను చేపట్టిన ఈ సేవ కార్యక్రమంలో 300 మంది సహాయకులు తనకు అండగా నిలిచినట్లుగా తెలిపారు. ప్రస్తుతం విజయవాడ కేంద్రానికి వచ్చేసరికి రెండు ఫుడ్ ట్రాక్ వాహనాలు ఏర్పాటు చేసి ఒక్కొక్క వాహనంలో ముగ్గురు సిబ్బందిని పెట్టడం జరిగిందని తెలిపారు. ఈవిధంగా ఒక్కొక్క వాహనానికి నెలకు రూ. 45,000 ఖర్చు అవుతోందని రెండు వాహనాలకి రూ. 90, 000 ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు. ఈవిధంగా ఏడాది పొడవున మొత్తం ఖర్చు రూ. 20 లక్షలు అవుతోందని .. ఫలితంగా రెండున్నర కోట్ల మందికి భోజనం సప్లై చేస్తున్నామని చెప్పారు. ఈ ఆహార పంపిణి కార్యక్రమానికి అయ్యే ఖర్చులకు తాను గతంలో ఉద్యోగం చేసి సంపాదించిన 10 లక్షల రూపాయలలో కొంత చొప్పున వెచ్చిస్తున్నారు. స్వచ్చందంగా విరాళాలు ఇచ్చే దాతల ద్వారా మరో 10 లక్షల రూపాయలు వస్తున్నాయని.. వాటిని కూడా ఈ సేవకే ఖర్చు చేస్తున్నట్లుగా తెలిపారు.
తాను చేస్తున్న ఈ మహాకార్యానికి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఆర్ధికంగా విరాళాలు ఇచ్చినా స్వీకరిస్తామని తెలిపారు భార్గవ్. అంతే కాదు విజయవాడ మచిలీపట్నం, హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాలలో ఇళ్లలో శుభకార్యాలు చేసుకున్న తర్వాత మిగిలిన ఆహార పదార్ధాలను తీసుకొని వెళ్లి పేదలకు పంచిపెట్టాలనుకునే వారు తన ఫోన్ నంబర్ 8886686000 కాల్ చేసి చెబితే తామే వాళ్ల దగ్గరకు వెళ్లి ఆహారాన్ని తీసుకొని పేదల ఆకలి తీరుస్తామని చెబుతున్నారు. మానవసేవయే మాధవసేవ అనే విధంగా ప్రతీ ఒక్కరూ ఆహారాన్ని వృధా చేయవద్దని.. తమకు సమాచారం ఇచ్చి చాలా మంది భోజనం దొరకని పేదల కడుపు నింపాలని ఈసందర్భంగా పిలుపునిస్తున్నారు భార్గవ్.
Vijayawada,Krishna,Andhra Pradesh


