విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్..లిఫ్ట్‌లో చిక్కుకున్న లాయర్లు..


విజయవాడ నగరంలోని కోర్టులో గురువారం హై టెన్షన్ నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కోర్టు భవనంలో లిఫ్ట్ ఆగిపోయింది. ఏడు, ఎనిమిది అంతస్తుల మధ్య నిలిచిన లిఫ్ట్‌లో 6గురు లాయర్లు చిక్కుకుపోయారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించినప్పటికీ లిఫ్ట్ కదలలేదు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సర్వీస్, పోలీస్ అధికారులు కోర్టు కాంప్లెక్స్‌ వద్దకు చేరుకున్నారు. లిఫ్ట్ మెయింటెనిన్స్ సిబ్బందిని కూడా అధికారులు పిలిపించారు. చివరకు అతికష్టం మీద లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఐదుగురు లాయర్లను ఫైర్ సిబ్బంది క్షేమంగా బయటకు తీశారు.

అయితే గత వారం రోజులుగా కోర్టు సముదాయంలో పలు లిఫ్ట్‌‌లు పనిచేయడం లేదని న్యాయవాదులు ఫిర్యాదు చేసినప్పటికీ.. లిఫ్ట్‌ నిర్వాహకులు పట్టించుకోలేదని లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు వైపులా ఉన్న లిఫ్ట్‌లో కేవలం రెండు మాత్రమే పనిచేస్తుండగా.. మరో రెండు వైపుల ఉన్న లిఫ్ట్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో కోర్టు సిబ్బంది ఎక్కే లిఫ్ట్‌నే న్యాయవాదులు వినియోగిస్తున్నారు. ఈరోజు(గురువారం) విధులకు హాజరయ్యేందుకు న్యాయవాదులు లిఫ్ట్‌లో ఎక్కగా.. ఆ సమయంలో కరెంట్ పోయింది. ఏడు, ఎనిమిది అంతస్తుల మధ్య లిఫ్ట్ నిలిచిపోయింది. లిఫ్ట్‌లో ఊపిరాడక న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది.. రెండు గంటల పాటు శ్రమించి న్యాయవాదులను బయటకు తీశారు. ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *