ఎన్డీఏకు 20 మంది తృణమూల్ సభ్యులు మద్దతు
స్పీకర్కు లేఖ ఇచ్చామన్న తిరుగుబాటు నేత కాకోలి ఘోష్
కోల్కతా/న్యూదిల్లీ: పశ్చిమ బెంగాల్లో మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సతమతమవుతున్న దీదీకి… లోక్సభ ఎంపీల నుంచి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు కేంద్రంలోని అధికాs ఎన్డీఏకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు. లోక్సభలో టీఎంసీ చీఫ్ విప్గా ఉన్న కాకోలీ ఘోష్ దస్తిదార్ ఈ ఎంపీలకు సారథ్యం వహిస్తున్నారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ…తమ నిర్ణయాన్ని స్పీకర్కు తెలియజేశామని, ఈ మేరకు లేఖ కూడా ఇచ్చామని చెప్పారు. కాగా, ఇప్పటికే కాకోలి ఘోష్ను పార్టీ విప్ పదవి నుంచి మమత తొలగించి, ఆ స్థానంలో ఎంపీ కల్యాణ్ బెనర్జీని నియమించారు. ఈ తొలగింపుపై లోక్సభ సెక్రటేరియట్కు తృణమూల్ అధికారికంగా సమాచారం ఇవ్వలేదని ఒక రెబెల్ ఎంపీ వెల్లడించారు. లోక్సభలో పార్టీ విప్గా తానే కొనసాగుతానని కాకోలి తెలిపారు. బెంగాల్లో వచ్చిన ప్రజాతీర్పు ఆధారంగానే కేంద్రంలో ఎన్డీఏకు మద్దతివ్వాలని తాము నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. తిరుగుబాటు ఎంపీలు తక్షణం తృణమూల్ను వీడి బీజేపీలో చేరాలని భావించటం లేదని, ఎన్డీఏకు మద్దతిస్తూ లోక్సభలో వేరు శిబిరంగా కొనసాగాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుకేందు శంకర్ రాయ్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్లో మమత గత ప్రభుత్వంలో అవినీతి పెచ్చరిల్లిపోయిందని, పార్టీ యంత్రాంగంలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందని, దీని ఫలితంగానే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని ఒక ప్రకటనలో సుకేందు వివరించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ ఆస్పత్రి ఘటనలో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన పోలీసు అధికారులపై అంతర్గత విచారణ జరిపించాలని తాను డిమాండ్ చేశానని, దాంతో తనను పార్టీలో పక్కనపెట్టారని తెలిపారు. అప్పట్లోనే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.


