Last Updated:
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇంధన ధరలు పెరగడంతో, నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, తెలంగాణలో రేవంత్ రెడ్డి కాన్వాయ్ వాహనాలు తగ్గిస్తున్నారు.
పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో, దేశంలో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇంధన పొదుపు చర్యలను చేపట్టడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగులు వేస్తున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండటంతో పాటు ప్రభుత్వ ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ భద్రతా వాహనాల శ్రేణిని (కాన్వాయ్) గణనీయంగా తగ్గించుకోవాలని నిర్ణయించారు. సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రులు పర్యటించే సమయంలో పెద్ద సంఖ్యలో వాహనాలు వెంట రావడం సహజం. అయితే ఇకపై జిల్లాల్లో పర్యటించేటప్పుడు తమ కాన్వాయ్లలో ఉండే వాహనాల సంఖ్యను 50 శాతానికి తగ్గించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేవలం వీరు మాత్రమే కాకుండా, మంత్రులు మరియు ఇతర వీఐపీలు కూడా సాధ్యమైనంత తక్కువ వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పొదుపు చర్యలు పాటిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, అదే బాటలో రాష్ట్రంలోనూ ఈ విధానాన్ని కొనసాగించాలని పవన్ కళ్యాణ్ తన కార్యాలయం ద్వారా వెల్లడించారు. ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియా వేదికగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గురువారం జరగనున్న క్యాబినెట్ భేటీలో ఈ పొదుపు చర్యలకు సంబంధించి మరిన్ని కీలక విధాన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను కుదించుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాన్వాయ్లో సుమారు 9 వాహనాలు ఉండగా, వాటిని 4 నుండి 5 వాహనాలకు పరిమితం చేసేలా కసరత్తు చేయాలని భద్రతా విభాగం పోలీసు అధికారులకు సూచించినట్లు సమాచారం. బుధవారం ఆయన తన నివాసం నుంచి ఎంసీఆర్హెచ్ఆర్డీకి వెళ్లే క్రమంలో కేవలం మూడు వాహనాలతోనే ప్రయాణించడం ద్వారా తన సంకల్పాన్ని చాటుకున్నారు. ఈ అంశంపై రాబోయే రెండు రోజుల్లో స్పష్టత రానుంది, తద్వారా మంత్రుల కాన్వాయ్లలో కూడా వాహనాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వినూత్న రీతిలో ప్రజల ఇబ్బందుల పట్ల స్పందించారు. బుధవారం విజయవాడలో జరిగిన ఒక సదస్సుకు హాజరైన సమయంలో, ఆయన కాన్వాయ్ కోసం పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయడంతో సామాన్య వాహనదారులు ఇబ్బంది పడటాన్ని ఆయన గమనించారు. వెంటనే హోటల్ వద్ద కారు దిగిన ఆయన, అక్కడ ఉన్న ట్రాఫిక్ అధికారులతో మాట్లాడుతూ.. “నా కోసం ట్రాఫిక్ ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు” అని కోరారు. భద్రత కంటే ప్రజల సౌకర్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన చేసిన సూచన పోలీసు అధికారులను, ప్రజలను ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



