విశాలాంధ్ర – తాడిపత్రి: పెట్రోల్, డీజిల్, గ్యాస్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య ఆధ్వర్యంలో సోమవారం తాడిపత్రి పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. నంద్యాల రోడ్డు, రంగప్ప కాలనీ సమీపంలో రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా టి. రంగయ్య మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. ఇంధన ధరల పెరుగుదలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందన్నారు.ప్రజలు వాహనాల వినియోగాన్ని తగ్గించి డబ్బులు పొదుపు చేసుకోవాలని చెప్పడం కేంద్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసి కమ్యూనిస్టు పార్టీలు ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తాయని, బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటాన్ని విస్తృత స్థాయిలో కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, మండల కార్యదర్శి నాగరంగయ్య, చేతివృత్తుల సంఘం నాయకులు సాలవేముల సూరి, శీను, నారాయణరెడ్డి, బాలనాయుడు, బాలు, రమణ, మహిళా నాయకులు లక్ష్మీదేవి, రామలచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.
The post పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ తాడిపత్రిలో సిపిఐ రాస్తారోకో… appeared first on Visalaandhra.


