Last Updated:
ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటగా, రాబోయే రోజుల్లో 45 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక, వైద్యులు జాగ్రత్తలు పాటించాలని సూచనలు
ఆంధ్రప్రదేశ్ అంతటా భానుడు తన ప్రతాపాన్ని క్రమంగా పెంచుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. మే నెల ఇంకా రాకముందే రాష్ట్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది.
గత 24 గంటల్లోనే ఎన్నడూ లేని విధంగా అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, తూర్పుగోదావరి, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, రాయలసీమ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వేడి తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో వాతావరణం విభిన్నంగా మారుతోంది. ఒక వైపు మండే ఎండలు ఉంటే, మరో వైపు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి ప్రాంతంలో కురిసిన వడగళ్ల వర్షం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. రహదారులపై మంచు ముక్కలు పేరుకుపోయేలా వడగళ్ల వర్షం కురవడం అరుదైన దృశ్యంగా మారింది.
రాయలసీమ ప్రాంతంలో వేడి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. కడపలో 40 డిగ్రీలు నమోదు కాగా, నంద్యాల, ఆళ్లగడ్డ, అనంతపురం, తిరుపతి ప్రాంతాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులతో ప్రజలు బయటకు రావడానికి కూడా వెనుకడుగు వేస్తున్నారు.
గోదావరి జిల్లాల్లో కూడా ఎండల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రహదారులు వెలవెలబోతుండగా, ప్రజలు ఇంట్లోనే ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, ముఖ్యంగా రోజువారీ కూలీలు ఈ వేడిని తట్టుకుని పనులు చేయాల్సి వస్తోంది. చెట్ల నీడలో కొద్దిసేపైనా విశ్రాంతి తీసుకుంటూ గడుపుతున్నారు.
ఈ నేపథ్యంలో వైద్య నిపుణులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. శరీరంలో నీరు తగ్గకుండా తరచూ మజ్జిగ, గంజి, గ్లూకోజ్ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తలకు టవల్ లేదా టోపీ ధరించడం, అవసరం లేకుండా ఎండలో తిరగకపోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. కొబ్బరి నీరు, సహజ శీతల పానీయాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మొత్తానికి రాబోయే ఐదు రోజులు ఏపీలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న జాగ్రత్తలే పెద్ద సమస్యలను నివారించగలవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వేసవి ప్రభావాన్ని తట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


