Last Updated:
గోదావరి జిల్లాల్లో శ్రీ వారాహి అమ్మవారి భక్తి వేగంగా పెరుగుతోంది, Pawan Kalyan వారాహి వాహనం ప్రభావంతో ఆలయాలు పెరిగి, బలబద్రపురం కొత్త ఆలయం ప్రత్యేక ఆకర్షణగా మారింది
గోదావరి జిల్లాల్లో శ్రీ వారాహి అమ్మవారి భక్తి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఒకప్పుడు కొద్దిమందికే పరిమితమైన వారాహి ఆరాధన ఇప్పుడు గ్రామాల నుంచి పట్టణాల వరకు విస్తరించి, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా మారింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం Pawan Kalyan ప్రచార యాత్రల్లో ఉపయోగించిన వారాహి వాహనం తర్వాత ఈ అమ్మవారి పేరు రాష్ట్రవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందింది. ఆ ప్రభావంతో గోదావరి జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో శ్రీ వారాహి అమ్మవారి ఆలయాలు నిర్మితమవుతూ, నిత్య పూజలు, ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
రాజమండ్రి, కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో ఇప్పటికే వారాహి అమ్మవారి ఆలయాలు భక్తులతో కళకళలాడుతుండగా, తాజాగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామంలో నిర్మించిన దివ్య వారాహి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయ నిర్మాణ శైలి, ప్రశాంత వాతావరణం, ఆధ్యాత్మిక శోభ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయంలో నేటి నుంచి ప్రత్యేకంగా ఐదు శుక్రవారాల కుంకుమ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
ఈ ఐదు శుక్రవారాల పూజల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలు నిర్వహిస్తే, అమ్మవారు కోరుకున్న మనోభిలాషలను తప్పక నెరవేర్చుతారని భక్తుల విశ్వాసం. ఆలయ అర్చకులు, ఆలయ వ్యవస్థాపకులు ఓగిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ ఇబ్బందులు, వివాహ ఆలస్యం, సంతాన సమస్యలు వంటి ఎన్నో కష్టాల నుంచి అమ్మవారి అనుగ్రహంతో ఉపశమనం లభిస్తోందని భక్తులు నమ్ముతున్నారు.
దీంతో ప్రతి శుక్రవారం మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ, కొవ్వూరు, రాజమండ్రి ప్రాంతాల్లోని వారాహి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తాజాగా బలబద్రపురం ఆలయం కూడా భక్తి కేంద్రంగా మారింది. గ్రామీణ వాతావరణంలో నిర్మించిన ఈ ఆలయం సినిమా సెట్ను తలపించేలా ఉండటంతో, భక్తులతో పాటు యువత కూడా భారీగా సందర్శిస్తున్నారు.
గోదావరి జిల్లాల్లో దుర్గాదేవి అమ్మవారిని ఎంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారో, ఇప్పుడు అదే స్థాయిలో శ్రీ వారాహి అమ్మవారిని కూడా పూజిస్తున్నారు. ప్రతి సంవత్సరం నవరాత్రుల సమయంలో ఇళ్లలో అమ్మవారి చిత్రపటాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించే సంప్రదాయం కూడా వేగంగా పెరుగుతోంది. ఆలయాల సంఖ్య పెరుగుతుండటం, భక్తుల విశ్వాసం రోజురోజుకూ మరింత బలపడుతుండటంతో గోదావరి జిల్లాల ఆరాధ్య దేవతగా శ్రీ వారాహి అమ్మవారు విరాజిల్లుతున్నారని చెప్పుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


