Last Updated:
ఏప్రిల్లో మార్కెట్లో దొరికే మామిడిని వ్యాపారులు కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో కృత్రిమంగా పండిస్తున్నారని నిపుణుల హెచ్చరిక, ఆరోగ్యానికి క్యాన్సర్ ముప్పు, జాగ్రత్తగా కొనాలని సూచన
వేసవికాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే. తీపి రుచి, సువాసనతో చిన్నా పెద్దా అందరినీ ఆకట్టుకునే ఈ ఫలరాజం కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఇప్పుడు అదే మామిడి పండు ఆరోగ్యానికి ముప్పుగా మారే పరిస్థితి నెలకొంటోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మార్కెట్లో అందంగా కనిపించే పండ్ల వెనుక దాగి ఉన్న ప్రమాదం గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విశాఖకు చెందిన పర్యావరణవేత్త, “మ్యాంగో మ్యాన్”గా పేరుగాంచిన అప్పాజీ ప్రకారం, ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న చాలా మామిడి పండ్లు సహజంగా పండినవి కావని అంటున్నారు. అధిక లాభాల కోసం వ్యాపారులు ముందుగానే పండ్లు మార్కెట్లోకి తీసుకురావడానికి క్రిమిసంహారక మందులు, ప్రమాదకర రసాయనాలు ఉపయోగిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో దొరికే మామిడి పండ్లు సహజ పక్వానికి రాకముందే కృత్రిమంగా పండించబడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
సహజంగా మామిడి పండ్లు పండాలంటే మే నెలలోనే పూర్తిగా పక్వానికి వస్తాయని, ఏప్రిల్లో అవి ఇంకా మామిడికాయ దశలోనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో పండ్లను త్వరగా పక్వం చేయడం వల్ల అవి బయటకు అందంగా కనిపించినా, లోపల విషపూరితంగా మారుతున్నాయని హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి రసాయనాలతో పండిన మామిడి పండ్లు తినడం వల్ల తలనొప్పి, వాంతులు, గ్యాస్ట్రిక్ సమస్యలు మాత్రమే కాకుండా దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. రుచి కోసం ఇలాంటి పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని స్పష్టం చేస్తున్నారు.
కృత్రిమంగా పండించిన మామిడిని గుర్తించడానికి కూడా కొన్ని సూచనలు ఉన్నాయి. పండు మొత్తం ఒకే విధంగా పసుపు రంగులో ఉండి, సహజంగా ఉండే పచ్చటి మచ్చలు లేకపోతే అది కెమికల్తో పండించినదై ఉండొచ్చని అంటున్నారు. సహజమైన మామిడికి తీయని సువాసన ఉంటుంది. కానీ రసాయనాలతో పండిన పండ్లకు ఘాటైన వాసన లేకపోతే అసలు వాసనే ఉండదని చెబుతున్నారు. అలాగే వాటి తొక్క కింద పుల్లగా, లోపల రుచిలేకుండా ఉండే అవకాశముంది.
అందుకే ప్రజలు మామిడి పండ్లు కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నమ్మకమైన రైతుల వద్ద లేదా ప్రకృతి వ్యవసాయం చేసే వారి దగ్గర నుంచి పండ్లు కొనుగోలు చేయడం మంచిదని అంటున్నారు. అలాగే తినే ముందు కనీసం గంటసేపు ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల కొంతవరకు రసాయనాల ప్రభావం తగ్గుతుందని సూచిస్తున్నారు. రుచి కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా, ప్రకృతి సిద్ధంగా పండిన మామిడి పండ్లనే ఎంచుకోవాలని నిపుణులు పిలుపునిస్తున్నారు. ఈ వేసవిలో మామిడి తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటేనే ఆరోగ్యం కాపాడుకోవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh
Apr 15, 2026 10:03 PM IST


