Last Updated:
Fuel Price Hike: విశాఖ దక్షిణలో వైఎస్సార్సీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వినూత్న నిరసన, చంద్రబాబు లోకేష్ పై తీవ్ర విమర్శలు, ధరలు తగ్గించాలని డిమాండ్
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందని పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సారధ్యంలో సోమవారం వైయస్సార్సీపి నిరసనా గ్రహం చేసింది. వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో 29వార్డు వైసీపీ అధ్యక్షుడు పీతలవాసు అధ్యక్షతన జగదాంబ జంక్షన్ వైయస్సార్ విగ్రహం వద్ద వినూత్న నిరసన చేపట్టారు
గాడిదను మోటర్ బైకుగా మాదిరిగా తయారు చేసి.. ఇక మాకు ఇదే వాహనం అంటూ ఎద్దేవా చేశారు. నినాదాలు చేస్తూ దక్షణ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మోటార్ సైకిళ్ళు నడిపించుకుంటూ జగదాంబ జంక్షన్ నుంచి చౌట్రీ తహశీల్దార్ కార్యాలయం వరకు వినూత్నంగా నిరసన తెలిపారు . రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తదితరులు వాసుపల్లితో కలిసి బైక్ ను దగ్దం చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఈ ప్రయత్నాన్ని అడ్డగించడంతో బైకును నేలకు బొర్లించి కాళ్లతో తొక్కి నిరసన తెలిపారు.
అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం తీవ్ర ఆందోళనకర విషయమన్నారు. ఈ పెంచిన ప్రభావం ప్రతి పేదవాడు సామాన్యుడు మధ్యతరగతి కుటుంబాలపై పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలతో అందలం ఎక్కి తెలంగాణ నుంచి పాలన చేస్తున్న చంద్రబాబు లోకేష్ లు స్పెషల్ ఫ్లైట్లో ఎవడబ్బ సొత్తుతో తిరుగుతున్నారని వాసుపల్లి ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా కొన్ని నిజాలు మాట్లాడుతున్నారే తప్ప.. ఇంకా లోకేష్ చంద్రబాబు డబ్బా ప్రగల్బాలు పలకడం సిగ్గుచేటు అన్నారు. *నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళినా 20 లక్షల ఉద్యోగాలు అంటూ చెప్పడం హాస్యాస్పదమన్నారు. రెండేళ్లు గడిచిన ఒక ఉద్యోగం కూడా ఇవ్వనివారు జిల్లాకు లక్ష ఉద్యోగాలు ఎక్కడ నుండి తెచ్చిస్తారని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అబద్దాల అనుభవంతో బాపట్ల బీచ్ ను గోవాకు తలదన్నేలా అభివృద్ధి చేస్తాననీ అక్కడ ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆరోపించారు.
ఇప్పటికైనా ఇలాంటి నీచ రాజకీయాలు మాని ప్రజలకు ఇచ్చిన హామీలు పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని వైఎస్సార్సీపీ విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే, నియోజవర్గ సమన్వయకర్త, వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ ధరల ప్రభావం రైతాంగం, రవాణా రంగం, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడుతోందన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవన వ్యయం మరింతగా భారమవుతోందని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు. ఇంధన ధరల ప్రభావం రవాణా రంగంపై పడి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలియం ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



