.- డిఎస్పీ ఎ శివప్రియ, సిఐ అల్లు వెంకటేశ్వరరావు
విశాలాంధ్ర – కడియం : చిన్నారులు మహిళల భద్రతే మా కర్తవ్యం అని రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పి ఎ శివప్రియ, కడియం సిఐ అల్లు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా డిఎస్పి డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు, కడియం మండలం, కడియపులంక శ్రీ సత్యదేవా నర్సరీలో, శుక్రవారం సాయంత్రం చిన్నారులు మహిళల భద్రతా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. చిన్నారుల మహిళల భద్రత కొరకు అమలులో ఉన్న చట్టాలు, భద్రతా చర్యలను వివరించారు. మహిళలు తమ హక్కులు, భద్రతా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వేధింపులు లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
తల్లిదండ్రులు చిన్నారుల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారి విద్య, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. మహిళలు, చిన్నారులకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈకార్యక్రమంలో ఎస్ఐ నాగ దుర్గా ప్రసాద్, ఏఎస్ఐ సీహెచ్ వెంకటరమణ, పోలీసు సిబ్బంది, నర్సరీ రైతులు పుల్లా పెద్ద సత్యనారాయణ, నర్సరీ సిబ్బంది పాల్గొన్నారు.


