వెంకట్ వకుళ ఫౌండేషన్ చైర్మన్ ఆలం వెంకట నరసానాయుడు..
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న వెంకట్ వకుళ ఫౌండేషన్ క్రికెట్ ఛాంపియన్స్ కప్ను వెంకట్ వకుళ ఫౌండేషన్ చైర్మన్ ఆలం వెంకట నరసానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం గ్రామీణ యువత క్రీడా పోటీలకు దూరమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు వెంకట్ వకుళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ ఛాంపియన్స్ కప్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్లో విజేత జట్టుకు రూ.50,000 నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు రూ.25,000 నగదు బహుమతి అందజేయనున్నట్లు వెల్లడించారు. గత ఏడాది ఈ పోటీలకు 70 జట్లు నమోదు చేసుకోగా, ఈ సంవత్సరం దాదాపు 87 క్రికెట్ జట్లు నమోదు కావడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల పట్ల యువతలో పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు.


