విశాలాంధ్ర-పెనుకొండ:పెనుకొండ పట్టణంలోని రామమందిరం వీధిలో ఆదివారం కుటుంబ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. భర్త కుటుంబం నుంచి న్యాయం చేయాలని కోరుతూ అశ్విని తన కుమారుడితో కలిసి భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది.అనంతపురానికి చెందిన అశ్వినికి 2006లో పెనుకొండకు చెందిన చిదంబర్నాథ్తో వివాహం జరిగింది. 2008లో వీరికి దినకర్ స్కంద్ కుమారుడు జన్మించాడు. వివాహం అనంతరం అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభమయ్యాయని అశ్విని ఆరోపించింది. అంతేకాకుండా భర్త తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2021లో తన కుమారుడితో కలిసి అనంతపురంలోని పుట్టింటికి వెళ్లినట్లు తెలిపింది.తరువాత చిదంబర్నాథ్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, ఇరు కుటుంబాల మధ్య పలు కేసులు నమోదయ్యాయి. ఇటీవల వరకట్న వేధింపుల కేసు కోర్టులో డిస్మిస్ అయిందని, అయితే తల్లి–కొడుకుల పోషణ కోసం ప్రతి నెల రూ.20 వేల చెల్లించాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని అశ్విని ఆరోపించింది.తన కుమారుడు ఇంటర్మీడియట్ పూర్తి చేశాడని, ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం అత్యవసరమైందని పేర్కొంది. వివాహ సమయంలో ఇచ్చిన బంగారు ఆభరణాలు, నగదు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. అలాగే భర్త కుటుంబానికి చెందిన ఆస్తుల్లో తమకు రావాల్సిన హక్కులు ఇప్పటికీ ఇవ్వలేదని వాపోయింది.భర్త ఇంటి ముందు నిరసన చేపట్టిన సమయంలో అత్తమామలు, భర్త ఇంటికి తాళం వేసి వేరే చోటికి వెళ్లిపోయారని అశ్విని తెలిపింది. ఎండలో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న తమను కనీసం వరండాలో కూర్చోనివ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.


