ఆంధ్రప్రదేశ్లో మే 23 (శనివారం) నుండి మే 26 వరకు కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాలలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం శనివారం రాష్ట్రవ్యాప్తంగా 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీయనున్నాయి. పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 46 డిగ్రీల నుండి 48 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో 43 నుండి 45 డిగ్రీలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాల్లో 41 నుండి 43 డిగ్రీల వరకు ఎండలు మండిపోనున్నాయి.



