Rural Development: ఆ జిల్లాకు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు.. కలెక్టర్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు! | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

Rural Development: చిత్తూరు జిల్లా గ్రామీణాభివృద్ధికి మూడు జాతీయ అవార్డులు దక్కగా, నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్ సుమిత్ కుమార్‌ను అభినందించారు, ప్లాస్టిక్ రహిత ఆంధ్ర లక్ష్యంగా సూచనలు ఇచ్చారు

News18
News18

చిత్తూరు జిల్లా గ్రామీణాభివృద్ధి, స్థానిక పరిపాలనలో సరికొత్త రికార్డు సృష్టించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను చిత్తూరు జిల్లాకు ఏకంగా మూడు జాతీయ అవార్డులు వరించాయి. జిల్లా సాధించిన ఈ అరుదైన గౌరవానికి గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు.

శుక్రవారం సాయంత్రం అమరావతి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి టెలి కాన్ఫరెన్స్‌లో ఈ అభినందనల ఘట్టం చోటుచేసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా మే నెల థీమ్ అయిన “ప్లాస్టిక్ రహిత రాష్ట్రం” అనే అంశంపై ముఖ్యమంత్రి ఈ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి నెల మూడవ శనివారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం’గా నిర్వహిస్తోందని సీఎం గుర్తుచేశారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 17వ స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలని కలెక్టర్లను ఆదేశించారు.

అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో ప్లాస్టిక్ నియంత్రణకు ప్రత్యేక తనిఖీలు (Special Drives) చేపట్టాలని, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

ఈ టెలి కాన్ఫరెన్స్ అనంతరం, పంచాయతీరాజ్ శాఖలో చిత్తూరు జిల్లా సాధించిన జాతీయ అవార్డుల పురస్కారాలపై సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. జిల్లా యంత్రాంగం నిరంతరం చేసిన కృషి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, పారదర్శక పాలన వల్లే ఈ మూడు జాతీయ అవార్డులు సాధ్యమయ్యాయని సీఎం కొనియాడారు. కలెక్టర్ సుమిత్ కుమార్ లీడర్‌షిప్‌ను ఆయన అభినందించారు.

కలెక్టరేట్ నుంచి ఈ టెలి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌తో పాటు స్థానిక పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు (MLA) డాక్టర్ కాళికాపురం మురళీమోహన్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (CPO) శ్రీనివాసులు, జిల్లా పంచాయతీ అధికారి (DPO) సుధాకర్ ఇతర ముఖ్య అధికారులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

జాతీయ స్థాయిలో మూడు అవార్డులు రావడం చిత్తూరు జిల్లా ప్రతిష్టను దేశవ్యాప్తంగా పెంచిందని స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో ‘స్వచ్ఛ ఆంధ్ర – ప్లాస్టిక్ రహిత జిల్లా’గా మార్చేందుకు మరిన్ని పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతామని, సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *