Last Updated:
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2026-27 ఇంటర్ అడ్మిషన్లకు ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 3 వరకు, మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు
ఇంటర్మీడియట్లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్న్యూస్ చెప్పింది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 3వ తేదీ వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.
టీటీడీ విడుదల చేసిన వివరాల ప్రకారం, అడ్మిషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించబడుతుంది. దరఖాస్తు ప్రక్రియ ఆంగ్ల భాషలో ఉన్నప్పటికీ విద్యార్థుల సౌకర్యార్థం స్టూడెంట్ యూజర్ మాన్యువల్తో పాటు కళాశాలల ప్రాస్పెక్టస్ను తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ముందుగా వెబ్సైట్లోకి వెళ్లి Student Manual in Telugu లేదా Student Manual in English ఎంపిక చేసుకుని పూర్తి విధానాన్ని జాగ్రత్తగా చదివిన తర్వాతే దరఖాస్తు ప్రారంభించాలని టీటీడీ సూచించింది.
ఇంటర్మీడియట్ కోర్సులకు సంబంధించిన వివిధ గ్రూపులు, అందుబాటులో ఉన్న సీట్లు, అర్హతలు, రిజర్వేషన్ నిబంధనలు, సీట్ల కేటాయింపు విధానం వంటి సమగ్ర సమాచారం వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపింది. విద్యార్థులు సమర్పించిన వివరాల ఆధారంగా గడువు పూర్తయ్యాక మెరిట్ మరియు రిజర్వేషన్ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని తాత్కాలికంగా సీట్లను ఆన్లైన్ ద్వారా కేటాయిస్తారని పేర్కొంది. ఎంపికైన విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందజేయనున్నారు.
అయితే దరఖాస్తు సమయంలో విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని టీటీడీ స్పష్టం చేసింది. సర్టిఫికెట్లలోని వివరాలు తప్పుగా ఉన్నా, సమర్పించిన సమాచారంతో సరిపోలకపోయినా సంబంధిత సీటు రద్దు కావడంతో పాటు దరఖాస్తు కూడా ఆటోమేటిక్గా తిరస్కరించబడుతుందని హెచ్చరించింది. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి మార్పులు, సవరణలకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది.
దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఎదురైనా, కోర్సుల ఎంపిక, హాస్టల్ సదుపాయాలు లేదా ఇతర నిబంధనలపై సందేహాలు ఉన్నా హెల్ప్లైన్ సేవలను వినియోగించుకోవచ్చని టీటీడీ సూచించింది. వెబ్సైట్లో హెల్ప్ లైన్ నంబర్లు విభాగంలో సంబంధిత అధ్యాపకుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రతిష్టాత్మక టీటీడీ విద్యాసంస్థల్లో సీటు పొందాలని ఆశించే విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే సరైన వివరాలతో దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirupati,Chittoor,Andhra Pradesh
May 07, 2026 11:01 PM IST



