Vijayawada: అమ్మాయిలను ట్రాప్ చేయడంలో మనోడి రూటే వేరు.. రూ. 2 కోట్లకు పైగా టోకరా వేసిన కిలాడీ.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికలపూడికి చెందిన ఇతడు ఎంసీఏ చదివి, హైదరాబాద్‌లోని పలు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేశాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Vijayawada: సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరాలకు వాడుకుంటూ, అమాయక యువతులను ప్రేమ, పెళ్లి, ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న పూనాటి శ్రీనివాస్ కిరణ్ బాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికలపూడికి చెందిన ఇతడు ఎంసీఏ చదివి, హైదరాబాద్‌లోని పలు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేశాడు. అయితే, జల్సాలకు అలవాటు పడి, బెట్టింగులు, మద్యానికి బానిసై భారీగా అప్పులు చేయడంతో మోసాల బాట పట్టాడు.

డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ దొరకకుండా జాగ్రత్తలు

నిందితుడి నేర శైలి పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది. తను పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ప్రతి కొత్త మోసానికి ఒక కొత్త సిమ్ కార్డును, కొత్త మొబైల్ ఫోన్‌ను ఉపయోగించేవాడు. విజయవాడలోని మొబైల్ షాపుల్లో హోల్‌సేల్‌గా సిమ్‌లు కొనుగోలు చేస్తానని నమ్మించి, ఒక్కోసారి పది చొప్పున సిమ్ కార్డులను సేకరించేవాడు. ఆ సిమ్ ఫోటోలను కాకినాడలోని తన పరిచయస్తులకు పంపి అక్కడ యాక్టివేట్ చేయించేవాడు. పని పూర్తయ్యాక ఆ సిమ్, మొబైల్ రెండింటినీ ధ్వంసం చేసేవాడు.

అంతులేని మోసాలు.. డేటింగ్ యాప్స్ ద్వారా వల

శ్రీనివాస్ కిరణ్ బాబు తన మోసాల కోసం మ్యాట్రిమోనీ మరియు డేటింగ్ సైట్లను ప్రధాన వేదికలుగా ఎంచుకున్నాడు. 2020 నుంచి ఇతడు ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నాడు. బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని నమ్మించి ఏకంగా రూ. 44.45 లక్షలు వసూలు చేశాడు. బాధితుల వద్ద డబ్బు లేకపోతే, వారికి తెలియకుండానే వారి పేరుతో రుణాలు (లోన్స్) తీయించి మరీ ఆ సొమ్మును కాజేసేవాడు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులో కూడా ఇతనిపై 10కి పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద రూ. 2 కోట్లకు పైగా ప్రజలను మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

బాధితురాలి ఫిర్యాదుతో బయటపడ్డ గుట్టు

విజయవాడకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఫోన్ చేసి, ఒక కోర్సు సర్టిఫికేషన్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేసేందుకు ప్రయత్నించగా ఆమె తిరస్కరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న నిందితుడు పలు నంబర్ల నుంచి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆ ఫోన్ నంబర్ల మూలాలను వెతుకుతూ కాకినాడ వరకు వెళ్లి, అక్కడి నుంచి నిందితుడి ఆనవాళ్లు సేకరించి చివరకు విజయవాడలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి ప్రవర్తనతో విసిగిపోయిన అతని తల్లిదండ్రులు కూడా అతడిని ఇంటికి రానివ్వడం లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడి వద్ద నుంచి పలు సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియా మరియు డేటింగ్ యాప్స్‌లో పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *