Last Updated:
తుని పట్టణంలో మురుగునీరు, చెత్తతో రహదారులు దయనీయ స్థితి, మహిళా ఎమ్మెల్యే యనమల దివ్య ఆకస్మిక తనిఖీలు, అధికారులకు ఫైనల్ వార్నింగ్, ప్రజలు కఠిన చర్యల కోసం ఎదురుచూపు
ఎండాకాలంలోనే వర్షాలు, దెబ్బతిన్న రహదారులు, ఎక్కడ చూసినా మురుగునీరు.. తుని పట్టణ ప్రజల దైనందిన జీవితం ఇబ్బందులతో నిండిపోయింది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో పరిస్థితి రోజురోజుకీ మరింత దారుణంగా మారుతుండగా, ప్రజలు, వ్యాపారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారులపై కూడా మురికి నీరు నిల్వ ఉండడం, డ్రైనేజీలు కుప్పలుగా మారి దుర్వాసన వెదజల్లడం వల్ల పట్టణం మొత్తం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో తుని మహిళా ఎమ్మెల్యే యనమల దివ్య ఆకస్మికంగా వర్షంలోనే తనిఖీలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మార్కెట్ పరిస్థితులు పరిశీలించేందుకు బయలుదేరిన ఆమె, మార్గమధ్యలో ప్రధాన రహదారి వద్ద ఉన్న భారీ డ్రైనేజీ వద్ద కాన్వాయ్ ఆపి పరిశీలించారు. అక్కడ కనిపించిన దృశ్యాలు ఆమెను షాక్కు గురి చేశాయి. చెత్తతో నిండిపోయిన కాలువలు, దుర్వాసన, రోడ్లపైకి చేరిన మురుగునీరు చూసి వెంటనే అధికారులను ప్రశ్నించారు.
ఏంటి ఇది..? ఇలానే వదిలేస్తారా..? శుభ్రం చేయించరా..? అంటూ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పనులు జరుగుతున్నట్లు చెప్పే ప్రయత్నం చేసినా, వాస్తవ పరిస్థితి చూసిన ఎమ్మెల్యే వెంటనే తిరస్కరించారు. ఇక్కడ పనులు జరుగుతున్నట్లే కనిపించడం లేదు.. ఇక ఇది ఫైనల్ వార్నింగ్ అంటూ స్పష్టం చేశారు.
ప్రతి వారం ఈ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రపరచి, ఫోటోలు జియో ట్యాగింగ్తో పంపించాలని అధికారులకు ఆదేశించారు. గతంలో కూడా ఇలాంటి హామీలు ఇచ్చినా అమలు కాలేదని గుర్తుచేస్తూ, ఇకపై నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. తుని పట్టణంలో 30కి పైగా వార్డులు ఉన్నప్పటికీ, శానిటేషన్ సమస్య మాత్రం ఎక్కడ చూసినా ఒకేలా ఉందని స్థానికులు చెబుతున్నారు. చెత్త పేరుకుపోవడం, డ్రైనేజీలు మూసుకుపోవడం, వర్షం పడితే రోడ్లపైకి మురుగునీరు రావడం సాధారణంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ పనులు జరుగుతున్న పేరుతో రోజులు గడుస్తుండగా, పరిస్థితి మరింత క్షీణిస్తోంది.
ఈ సమస్యలకు ప్రధాన కారణం సిబ్బంది కొరతా లేదా ఉన్న సిబ్బంది నిర్లక్ష్యమా అన్న దానిపై అధికారులు లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పట్టణం మొత్తం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, శానిటేషన్ విషయంలో మాత్రం వెనుకబడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎమ్మెల్యే చేసిన ఈ సడన్ ఇన్స్పెక్షన్ తర్వాతైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందా..? అధికారులు తమ పని తీరును మార్చుకుంటారా..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రజలు మాత్రం ఈసారి అయినా కఠిన చర్యలు తీసుకుని పట్టణాన్ని శుభ్రంగా మార్చాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh
May 02, 2026 11:01 PM IST


