మంగళగిరి-తాడేపల్లిలో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన


మంగళగిరి-తాడేపల్లికి మహర్దశ.. రూ.1,167 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన

మంత్రులు లోకేశ్‌, పెమ్మసాని చేతుల మీదుగా పనులకు శ్రీకారం

మంగళగిరి నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తీవ్రమైన మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటీఎంసీ) పరిధిలో సుమారు రూ.1,167 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) వ్యవస్థ పనులకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలోని ప్రాతూరు రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి లోకేశ్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను లాంఛనంగా ప్రారంభించారు.

ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి నారా లోకేశ్‌ తన హామీ నెరవేర్చడంపై దృష్టి సారించారు. తొలి ప్రాధాన్యతగా భూగర్భ డ్రైనేజీకి సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధం చేయించి, నిధుల మంజూరుతో పాటు పరిపాలన అనుమతులు కూడా వేగంగా తీసుకువచ్చారు. ఈ ప్రాజెక్టుతో మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేశ్‌ పునరుద్ఘాటించారు. అంతకుముందు కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులకు టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. దశాబ్దాల నాటి తమ చిరకాల వాంఛ నెరవేరుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

రెండు దశల్లో బృహత్తర నిర్మాణం
ఈ యూజీడీ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లో రెండు దశలుగా చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.1,167.50 కోట్లు కాగా, మొదటి దశ పనులకు రూ.604.32 కోట్లు, రెండో దశకు రూ.563.18 కోట్లు కేటాయించారు. రాజధాని గ్రామాలైన బేతపూడి, నవులూరు, యర్రబాలెం, నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి మినహా మిగిలిన ఎంటీఎంసీ ప్రాంతమంతా ఈ ప్రాజెక్టు పరిధిలోకి వస్తుంది.

ప్రాజెక్టులో భాగంగా మొత్తం 531 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను నిర్మించనున్నారు. ఇందులో ఫేజ్-1లో 300 కి.మీ., ఫేజ్-2లో 231 కి.మీ. మేర పనులు చేపడతారు. మురుగునీటిని శుద్ధి చేసేందుకు మొత్తం 20 మురుగునీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీ) ఏర్పాటు చేయనున్నారు. వీటి మొత్తం సామర్థ్యం రోజుకు 47.51 మిలియన్ లీటర్లు (ఎంఎల్‌డీ)గా ఉంది. ఆధునిక ఎస్‌బీఆర్ టెక్నాలజీతో 14 ఎస్టీపీలు, ఎఫ్‌బీ టెక్ ప్యాకేజ్డ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లుగా మరో 6 కేంద్రాలను నిర్మిస్తారు. వీటితో పాటు 18 లిఫ్ట్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మంగళగిరి-తాడేపల్లి ప్రాంత రూపురేఖలు మారడంతో పాటు, ప్రజారోగ్యానికి భరోసా లభిస్తుంది.

ఈ కార్యక్రమంలో పద్మశాలీ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *