Bike Fire Incident: కొడుకు జల్సాలకు తండ్రి చెక్.. నడిరోడ్డుపై బైక్ తగలబెట్టిన ఆటో డ్రైవర్! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖపట్నం పెందుర్తిలో ఆటో డ్రైవర్ తండ్రి, కొడుకు నిర్లక్ష్య డ్రైవింగ్, వరుస చలానాలు, ప్రమాదాలపై ఆవేదనతో అప్పు చేసి కొనిచ్చిన బైక్‌ను తానే తగలబెట్టాడు

News18
News18

విశాఖపట్నం జిల్లా పెందుర్తి పరిధిలో చోటుచేసుకున్న ఒక వినూత్న సంఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా పిల్లలు అడిగింది కాదనకుండా కొనిచ్చే తండ్రులు మనకు కనిపిస్తారు, కానీ తన కొడుకు విచ్చలవిడితనాన్ని కట్టడి చేసేందుకు తాను ఎంతో కష్టపడి కొనిచ్చిన మోటార్ సైకిల్‌ను తండ్రే స్వయంగా తగలబెట్టడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ ఘటన వెనుక ఉన్న ఆవేదన, ఒక సగటు తండ్రి పడే సంఘర్షణను ప్రతిబింబిస్తోంది.

విశాఖలోని వేపగుంట సమీపంలో ఉన్న బంటా కాలనీలో ఒక వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నిత్యం రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో తన ఇద్దరు కుమారుల అవసరాలను తీర్చేందుకు ఆయన ఎంతో శ్రమిస్తుంటారు. అందులో ఒక కుమారుడు కాలేజీకి వెళ్లడానికి బైక్ కావాలని తండ్రిని కోరాడు. ఒక ఆటో డ్రైవర్‌గా తన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ, కుమారుడి చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో సుమారు ఏడాది క్రితం అప్పులు చేసి మరీ కొత్త మోటార్ సైకిల్‌ను కొనిచ్చారు.

బైక్ చేతికి వచ్చిన తర్వాత సదరు యువకుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి, జల్సాలకు అలవాటు పడ్డాడు. కాలేజీకి వెళ్లడం కంటే స్నేహితులతో కలిసి నగరం చుట్టూ తిరగడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. అంతేకాకుండా, రోడ్డు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారీతిన వాహనాన్ని నడిపేవాడు. అతివేగం, హెల్మెట్ లేకపోవడం, ప్రమాదకరంగా వాహనాన్ని నడపడంతో నిరంతరం ట్రాఫిక్ చలానాలు వచ్చేవి. ఈ జరిమానాలను తండ్రే కట్టాల్సి వచ్చేది.

గతేడాది ఇదే విధంగా అతివేగంగా వెళ్తూ ఒక ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో తన కొడుకు ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ తండ్రి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం దాదాపు లక్ష రూపాయల వరకు వెచ్చించారు. అప్పు చేసి కొనిచ్చిన బైక్ ఒకవైపు, ప్రాణాలు కాపాడటానికి చేసిన ఖర్చు మరోవైపు ఉన్నా.. కొడుకు మారుతాడని ఆ తండ్రి ఆశపడ్డారు.

అయితే, ఇన్ని జరిగినా కుమారుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇటీవల మళ్లీ ‘ట్రిపుల్ రైడింగ్’ చేస్తూ పోలీసులకు చిక్కాడు. దీనికి సంబంధించిన ట్రాఫిక్ చలానా ఇంటికి రావడంతో ఆ తండ్రి సహనం నశించింది. కష్టపడి సంపాదించిన డబ్బు చలానాలకే సరిపోతుండటం, మరోవైపు కొడుకు ప్రాణాలు ఎప్పుడు ఏ ప్రమాదంలో పడతాయో అన్న భయం ఆయనను కుంగదీశాయి.

“ఈ బైక్ ఉన్నంత కాలం నా కొడుకు పద్ధతి మారదు, వాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు” అనే ఆవేశం, ఆవేదనతో ఆ తండ్రి ఒక కఠిన నిర్ణయానికి వచ్చారు. వెంటనే ఆ బైక్‌ను కాలనీకి కొంచెం దూరంగా ఉన్న ఖాళీ ప్రదేశానికి తీసుకువెళ్లి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. కళ్లముందే బైక్ తగలబడుతుంటే ఆ తండ్రి ఆవేదన చూసి స్థానికులు విస్తుపోయారు.

ఈ ఘటన కేవలం ఒక బైక్ తగలబడటం మాత్రమే కాదు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే నేటి యువతకు ఒక హెచ్చరిక లాంటిది. తల్లిదండ్రులు తమ కోరికలను చంపుకుని పిల్లలకు సౌకర్యాలు కల్పిస్తుంటే, వాటిని దుర్వినియోగం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన చెబుతోంది. కొడుకు జల్సాలకు చెక్ పెట్టేందుకు ఆ తండ్రి తీసుకున్న ఈ ‘అగ్ని పరీక్ష’ లాంటి నిర్ణయం ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్ అయ్యింది. పోలీసుల కథనం ప్రకారం, కేవలం కొడుకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఆయన ఆవేశంతో ఈ పని చేసినట్లు తెలుస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *