Last Updated:
Liquor Scam: నంద్యాల జిల్లా డోన్లో ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి స్టేషన్లో స్వాధీనం మద్యం అక్రమంగా అమ్మిన ఆరోపణలపై కేసు, సస్పెండ్, డీఎస్పీ దర్యాప్తు కొనసాగుతోంది
శాంతి భద్రతలను కాపాడాల్సిన వారే చట్టాన్ని అతిక్రమిస్తే ఎలా ఉంటుందో నంద్యాల జిల్లా డోన్లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన ఉన్నతాధికారి, స్వయంగా అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన వైనం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎక్సైజ్ దాడుల్లో పట్టుబడిన మద్యాన్ని స్టేషన్ నుంచి మాయం చేసి, ప్రైవేటు వ్యక్తుల ద్వారా విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయారు ఒక మహిళా అధికారి.
నంద్యాల జిల్లా డోన్ పట్టణ పోలీసులు ఆదివారం రాత్రి సాధారణ తనిఖీల్లో భాగంగా చాకిరేవుమిట్ట వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో పి.ఆర్ పల్లికి చెందిన సోమనాథ్ అనే వ్యక్తి కారును ఆపి తనిఖీ చేయగా, పోలీసులే విస్తుపోయే దృశ్యం కనిపించింది. ఆ కారులో ఏకంగా 379 మద్యం సీసాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద అంత పెద్ద మొత్తంలో మద్యం ఉండటం నేరం. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, ఈ మద్యం ఎక్కడిది? ఎక్కడ కొనుగోలు చేశావు? అని గట్టిగా విచారించారు.
పోలీసుల విచారణలో సోమనాథ్ చెప్పిన సమాధానం విని అధికారులు అవాక్కయ్యారు. ఆ మద్యాన్ని తాను ఎక్కడో అక్రమంగా కొనలేదని, సాక్షాత్తూ డోన్ ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి తనకు ఇచ్చారని అతను వెల్లడించాడు. అంతేకాకుండా, ఎక్సైజ్ శాఖ వివిధ దాడుల్లో భాగంగా గతంలో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని స్టేషన్ నుంచి బయటకు తరలించి, బెల్టు దుకాణాల ద్వారా అమ్మించి సొమ్ము చేసుకోవాలని ఆమె తనను పురమాయించినట్లు నిందితుడు అంగీకరించాడు.
సాధారణంగా ఎక్సైజ్ దాడుల్లో పట్టుబడిన మద్యాన్ని కోర్టు ఆదేశాల మేరకు లేదా ఉన్నతాధికారుల సమక్షంలో ధ్వంసం చేయాలి. కానీ, సీఐ వరలక్ష్మి తన అనుచరులను అడ్డం పెట్టుకుని స్టేషన్ భద్రతలో ఉండాల్సిన స్టాక్ను రహస్యంగా బయటకు పంపినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. పోలీసులు సీఐ వరలక్ష్మిని వివరణ కోరగా, ఆమె తాను ఆ మద్యం ఇవ్వలేదని, స్టేషన్లో ఎవరైనా ఇచ్చి ఉండవచ్చని పొంతన లేని సమాధానాలు చెప్పారు. అయితే, ప్రాథమిక ఆధారాలు, నిందితుడి వాంగ్మూలం మేరకు ఆమె ప్రమేయం ఉందని పోలీసులు నిర్ధారించారు.
ఈ అక్రమ దందాపై డోన్ డీఎస్పీ శ్రీనివాసులు స్పందిస్తూ.. సీఐ వరలక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు ధృవీకరించారు. కేసు దర్యాప్తులో ఉందని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. మరోవైపు, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి, శాఖకు చెడ్డపేరు తెచ్చినందుకు గాను నంద్యాల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కఠిన చర్యలు తీసుకున్నారు. సీఐ వరలక్ష్మిని వెంటనే సరెండర్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



