Andhra University: విశాఖ అభివృద్ధి అన్‌స్టాపబుల్.. ఏయూ సభలో చంద్రబాబు బిగ్ స్టేట్‌మెంట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొని వర్సిటీ గ్లోబల్ హబ్‌గా ఎదిగిందని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని తెలిపారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. విశాఖపట్నంలో వైభవంగా జరుగుతున్న ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక విద్యాసంస్థ వంద సంవత్సరాల పాటు నిరంతరాయంగా విజ్ఞానాన్ని పంచుతూ ఈ స్థాయికి చేరుకోవడం గర్వకారణమని, ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, ఒక గొప్ప చరిత్రకు నిదర్శనమని అభివర్ణించారు.

ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీగా రూ.500 కోట్లు ప్రకటించారు. అంతేకాకుండా కార్పస్ ఫండ్ బలోపేతం కోసం మరో రూ.500 కోట్లు విరాళాల రూపంలో సమీకరించాలని సూచించారు. యూనివర్సిటీలో చదివిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు అందరూ ముందుకు వచ్చి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి ఒక్క రూపాయి అయినా అందించి ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం కోరారు.

ఏయూ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉందనడానికి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులే నిదర్శనమని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయంలో సుమారు 58 దేశాలకు చెందిన అంతర్జాతీయ విద్యార్థులు విద్యనభ్యసించడం విశేషమని, ఇది వర్సిటీ విద్యా ప్రమాణాలకు అద్దం పడుతోందని చెప్పారు. ఒకప్పుడు కేవలం ప్రాంతీయ అవసరాల కోసం ప్రారంభమైన ఈ సంస్థ, నేడు గ్లోబల్ హబ్‌గా మారిందని ఆయన ప్రశంసించారు. విశ్వవిద్యాలయాలు అంటే కేవలం డిగ్రీలు, పట్టాలు ఇచ్చే కేంద్రాలు మాత్రమే కాదని, అవి సమాజ గమనాన్ని మార్చే విజ్ఞాన గనులు కావాలని ఆయన ఆకాంక్షించారు.

విశాఖపట్నం నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. విశాఖ ఇకపై కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే కాదని, ఒక ‘గ్లోబల్ సిటీ’గా అవతరించబోతోందని స్పష్టం చేశారు. నగర అభివృద్ధి ఇకపై ‘అన్ స్టాపబుల్’ (ఆపలేనిది) అని వ్యాఖ్యానించిన ఆయన, ఐటీ రంగంలో కీలక మార్పులు రాబోతున్నాయని చెప్పారు. విశాఖకు త్వరలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ (Google Data Center) రాబోతోందని, దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.

దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలకు ఆంధ్ర యూనివర్సిటీ ఒక దిక్సూచిలా నిలుస్తోందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఈ సంస్థ ఇంతటి ఉన్నత స్థితికి చేరుకోవడం వెనుక ఎందరో మహానుభావుల కృషి ఉందని ఆయన కొనియాడారు. వర్సిటీ తొలి వైస్ ఛాన్సలర్ (VC) కట్టమంచి రామలింగారెడ్డి గారు వేసిన బలమైన పునాదులే నేటి ప్రగతికి మూలమని చెప్పారు. అలాగే, ఇక్కడ రెండవ వీసీగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆ తర్వాత భారత రాష్ట్రపతిగా దేశానికే గర్వకారణంగా నిలిచారని ఆయన సగర్వంగా గుర్తు చేసుకున్నారు.

తెలుగు భాషా వైభవానికి, సాహిత్య వికాసానికి ఏయూ చేసిన సేవలు అనన్యసామాన్యమని చంద్రబాబు కొనియాడారు. ఎంతో మంది ప్రముక కవులు, రచయితలకు ‘కళాప్రపూర్ణ’ వంటి విశిష్ట బిరుదులను ఇచ్చి గౌరవించిన ఘనత ఈ యూనివర్సిటీకే దక్కుతుందన్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా రాణిస్తుండటం ఈ గడ్డకు గర్వకారణమని చెప్పారు. విశ్వవిద్యాలయాలు అనేవి రాష్ట్ర చారిత్రక సంపద అని, వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవడం మనందరి బాధ్యత అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *