Last Updated:
నూతిబందలో సిఫా ట్రస్ట్ చెక్డ్యామ్ ప్రారంభం, 147 ఎకరాలకు సాగునీరు, పి. మల్లిఖార్జునరావు అడవి సంరక్షణ, ఆదివాసీ సంక్షేమానికి కట్టుబాటు, గ్రామ ఆర్థిక బలోపేతం
అడవి మనకు తల్లి లాంటిదని, దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. మల్లిఖార్జునరావు పిలుపునిచ్చారు. చింతపల్లి మండలం, లంబసింగి పంచాయతీ పరిధిలోని నూతిబంద గ్రామంలో సిఫా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన చెక్డ్యామ్ను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవిలోని చెట్లు, జీవులు మాత్రమే కాకుండా అక్కడి జలవనరులు కూడా మన భవిష్యత్తుకు కీలకమని స్పష్టం చేశారు. అడవుల నుంచి లభించే ఫలాలు తరతరాలకు అందాలంటే వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు తమ భూముల్లోనే పంటలు పండించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. భవిష్యత్తులో అడవుల పరిరక్షణతో పాటు ఆదివాసీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆంధ్రా విశ్వవిద్యాలయం సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు మాట్లాడుతూ సిఫా ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. నూతిబంద గ్రామంలో నిర్మించిన చెక్డ్యామ్ వల్ల దాదాపు 147 ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇది గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే కీలక అడుగుగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
చింతపల్లి డిఎఫ్ఓ వైవి నరసింహారావు మాట్లాడుతూ అడవులు తరతరాలకూ జీవనాధారమని, వాటి పరిరక్షణ ఎంతో అవసరమని అన్నారు. ప్రజలకు తాగునీటి సమస్యలు ఉంటే వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సిఫా ట్రస్ట్ సిఇఓ డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ ఈ గ్రామం ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు ట్రస్ట్ కృషి చేస్తోందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చింతపల్లి ఎఫ్ఆర్ఒ బి అప్పారావు, డౌనూరు ఎస్ఒ జి అనీల్ కుమార్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, సిఫా ట్రస్ట్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. చెక్డ్యామ్ ప్రారంభంతో గ్రామంలో కొత్త ఆశలు చిగురించగా, అడవి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా ఈ కార్యక్రమం ఒక మంచి ప్రారంభంగా మారింది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh
Apr 25, 2026 10:14 PM IST


