Last Updated:
విజయనగరం తెర్లాం పోక్సో కేసులో ముడిదానా హరికృష్ణకు 20 ఏళ్ల జైలు, 3 వేల జరిమానా, బాధితురాలికి 5 లక్షల పరిహారం, ఎస్పీ మహిళల భద్రతపై హెచ్చరిక
విజయనగరం జిల్లా తెర్లాం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ వెల్లడించారు. నిందితుడికి రూ.3 వేల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం మంజూరు చేసినట్లు తెలిపారు.
పోలీసులు వివరాలు ప్రకారం తెర్లాం మండలానికి చెందిన ఒక మైనర్ బాలికను అదే మండలానికి చెందిన ముడిదానా హరికృష్ణ (19) పరిచయం చేసుకున్నాడు. అనంతరం ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మాయమాటలు చెప్పి బాలికను తన వశం చేసుకున్నాడు. తన ఇంట్లో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు దర్యాప్తులో తేలింది. తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికను విజయవాడకు తీసుకెళ్లి అక్కడ కొద్ది రోజుల పాటు దుర్వినియోగం చేసి తిరిగి ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెర్లాం పోలీస్ స్టేషన్లో 2025 మార్చి 5న పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్ఐ బి.సాగర్ బాబు కేసు నమోదు చేయగా, అప్పటి బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యారెడ్డి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి, అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు.
కేసు విచారణ అనంతరం నిందితుడిపై ఆరోపణలు రుజువు కావడంతో విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కె. నాగమణి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం అందజేయాలని ఆదేశించారు. ఈ కేసులో ప్రభుత్వ తరఫున పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.సత్యం వాదనలు వినిపించారు. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పని చేసిన అప్పటి డీఎస్పీ జి.భవ్యారెడ్డి, ఎస్ఐ బి.సాగర్ బాబు, సిఎంఎస్ హెచ్సి సిహెచ్ రామకృష్ణ, కోర్టు హెడ్ కానిస్టేబుల్ జి.జనార్ధనరావు, స్పెషల్ పీపీ జి.సత్యంను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
మహిళలు, పిల్లల భద్రతే జిల్లా పోలీస్ శాఖకు మొదటి ప్రాధాన్యత అని ఎస్పీ పేర్కొన్నారు. మైనర్ బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేసవి సెలవుల సమయంలో బాలికలు మరింత అప్రమత్తంగా ఉండాలని, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రేమ పేరుతో మోసగాళ్లు చెప్పే మాటలను నమ్మి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



