సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల భారాన్ని తగ్గించి, సత్వర న్యాయం అందించే లక్ష్యంతో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) మినహా మిగతా జడ్జీల సంఖ్యను 33 నుంచి 37కు పెంచనుంది. ఈ మేరకు ఁసుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026ఁకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. న్యాయమూర్తుల సంఖ్య పెంపు ద్వారా సుప్రీంకోర్టు పనితీరు మెరుగుపడుతుందని, పెండింగ్ కేసుల విచారణ వేగవంతమవుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. దీనివల్ల కక్షిదారులకు సకాలంలో న్యాయం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. పెంచిన జడ్జీల జీతభత్యాలు, సిబ్బంది ఖర్చులు, ఇతర మౌలిక సదుపాయాల వ్యయాన్ని భారత సంఘటిత నిధి నుంచి భరించనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(1) ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం ఉంది. ఈ నేపథ్యంలో 1956 నాటి చట్టాన్ని సవరించడం ద్వారా ప్రభుత్వం ఈ మార్పులు చేస్తోంది. గతంలో కూడా పలుమార్లు జడ్జీల సంఖ్యను పెంచారు. చివరిసారిగా 2019లో జడ్జీల సంఖ్యను 30 నుంచి 33కి పెంచారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది.


