సహారా ఎడారిలో ఘోర విషాదం.. దాహంతో 49 మంది మృతి


నైజర్‌లోని సహారా ఎడారిలో ట్రక్కు మొరాయించి 49 మంది మృతి
పొరుగు దేశంలోని ఉత్సవాలకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం
50 కిలోమీటర్లు నడిచి ఇద్దరు ప్రాణాలతో బయటపడటంతో వెలుగులోకి ఘటన
మృతదేహాలను అక్కడే సామూహిక ఖననం చేసిన అధికారులు

పశ్చిమాఫ్రికా దేశమైన నైజర్‌లోని సహారా ఎడారిలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న ట్రక్కు మార్గమధ్యంలో సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో, తాగునీరు లభించక 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర నైజర్‌లోని అగడెజ్ ప్రాంతంలో ఈ ఘోర ఉదంతం వెలుగుచూసింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, మృతులంతా నైజర్ దేశస్తులే. పొరుగు దేశమైన మాలిలో జరిగిన ఒక మతపరమైన ఉత్సవానికి హాజరై స్వదేశానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అల్జీరియా, మాలి సరిహద్దులకు సమీపంలోని అస్సమకా పట్టణానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో వీరి వాహనం నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులందరూ ఎడారిలో రోజుల తరబడి చిక్కుకుపోయి, తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఈ ఘోర ప్రమాదం నుంచి ఇద్దరు వ్యక్తులు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. వారు సుమారు 50 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించి, అస్సమకా పట్టణానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకోగా, ట్రక్కు పరిసరాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు దర్శనమిచ్చాయి. మృతదేహాలను తరలించడం కుదరకపోవడంతో, వారిని అక్కడే సామూహికంగా ఖననం చేశారు.

ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అత్యంత కఠినంగా ఉంటాయని, విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా ఇక్కడ చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడటం అసాధ్యమని అధికారులు తెలిపారు. అదే సమయంలో, సమీపంలోనే నిలిచిపోయిన మరో ట్రక్కులోని ప్రయాణికులను సహాయక బృందాలు గుర్తించి, వారికి నీరు అందించి రక్షించాయి. ఉత్తర ఆఫ్రికా, ఐరోపా దేశాలకు వెళ్లే వలసదారులకు, ప్రయాణికులకు ఈ మార్గం అత్యంత ప్రమాదకరంగా మారిందని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *