కాంగ్రెస్‌కు ‘ఆత్మనిర్భర్ భారత’ గిట్టదు


నిరాశావాదులు వాళ్లు అంటూ రాహుల్‌కు మోదీ చురకలు
న్యూఢిల్లీ:
కాంగ్రెస్ పార్టీకి ‘ఆత్మనిర్భర్ భారత’ అంటే గిట్టదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపైన, కాంగ్రెస్ పార్టీపైనా గుజరాత్‌లోని సూరత్‌లో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ధ్వజమెత్తారు. దేశంలో కొందరు నిరాశావాదులు ఉన్నారనీ, ‘అత్మనిర్భర్ భారత’ ప్రచారాన్ని, దేశ దృఢ సంకల్పన్ని విమర్శించడమే వీళ్లు పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఇతర దేశాలపై ఆధారపడం వల్ల ఏ దేశం తాను నిజంగా సాధించాల్సిన అభివృద్ధిని అందుకోలేదన్న విషయాన్ని వీరు విస్మరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ…అలజడలు, అస్థిరతను వ్యాప్తి చేయడం ద్వారా అవకాశాలు పొందాలని చూస్తోందన్నారు. దేశ ప్రజలు వీరి పన్నాగాలను ఎప్పటికప్ప్పుడు తిప్పికొడుతూ వస్తున్నారని ప్రధాని అన్నారు. ‘గుజరాత్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అడ్రెస్ లేకుండా చేసారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట్లలోనూ వారి అవకతవకల పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు ఉదాహరణ. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఆ పార్టీ దారుణమైన ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ అవకతవకల పాలనను హిమాచల్ ప్రజలు తిప్పికొట్టారు. దీనికి ముందు హర్యానాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. పంజాబ్ ప్రజలు కూడా ఆ పార్టీకి స్పష్టమైన సందేశం ఇచ్చారు. అల్లకల్లోలంలో అవకాశాలు వెతుక్కోవడం అనే కాంగ్రెస్ రాజకీయం ఎప్పటికీ పనిచేయదు’ అని మోదీ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే వారు సీఎంను మార్చాల్సి వచ్చిందని ఇటీవల అక్కడ జరిగిన పరిణామలపై మోదీ వ్యాఖ్యానించారు. పెట్రోల్ ధరల్లో నిలకడ లేకపోవడం, సప్లయ్ చైన్స్ కుప్పకూలడం వంటివి చోటుచేసుకున్నాయని, ఈ నేపథ్యంలో ప్రతి సంక్షోభాన్ని 140 కోట్ల మంది ప్రజలు సమష్టిగా ఎదుర్కోవడం తనకెంతో తృప్తినిచ్చిందని అన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా సూరత్‌లో రూ.18,800 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

The post కాంగ్రెస్‌కు ‘ఆత్మనిర్భర్ భారత’ గిట్టదు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *