Last Updated:
తిరుపతి జిల్లా నాయుడుపేట తూపిలిపాలెం బీచ్ వద్ద సముద్రంలో శివలింగం, నంది, నాగ విగ్రహాలు బయటకు రావడంతో భక్తులు భారీగా చేరుకుని పూజలు చేస్తూ వీడియోలు వైరల్ చేస్తున్నారు
తిరుపతి జిల్లాలోని నాయుడుపేట సమీప తూపిలిపాలెం బీచ్ వద్ద బుధవారం ఒక విశేష ఘటన చోటుచేసుకుని స్థానికులను, యాత్రికులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా సరదాగా సముద్రస్నానానికి వచ్చిన వారు ఒక్కసారిగా కడలి అలల మధ్య కనిపించిన శివలింగం ఆకారాన్ని గమనించి విస్మయానికి లోనయ్యారు. సముద్రం నుంచి స్వయంగా శివలింగం ప్రత్యక్షమైనట్టుగా భావించిన భక్తులు ఆ దృశ్యాన్ని చూసి భక్తి భావంతో నిండిపోయారు. క్షణాల్లోనే ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
శివలింగం కనిపించగానే అక్కడున్న భక్తులు దానిని ఒడ్డుకు తీసుకురావడానికి ప్రయత్నించారు. అలలతో పోరాడుతూ ఎంతో కష్టపడి చివరకు లింగాన్ని భద్రంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దగ్గరగా చూసిన వారు ఇది తమ జీవితంలో అరుదైన అనుభవమని ఆనందం వ్యక్తం చేశారు. కొందరు ఈ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ ఘటన వేగంగా వైరల్ అవుతోంది.
ఈ ఘటనతో పాటు నంది, నాగ పడగల ఆకారంలో మరికొన్ని విగ్రహాలు కూడా సముద్రం నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం రావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యం ఏర్పడి, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో బీచ్కు చేరుకుని దర్శనం చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సముద్ర అలల్లో ఇలా విగ్రహాలు కనిపించడం దైవ చింతనగా భావిస్తున్న భక్తులు, ఇది శుభసూచకమని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉండగా, బీచ్ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పలువురు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirumala,Chittoor,Andhra Pradesh


