వర్క్ ఫ్రమ్ హోమ్‌పై ఏపీ సర్కార్ కసరత్తు..


పశ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల‌ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపునకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇంధన సంక్షోభాన్ని నివారించే ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసే అంశంపై ఏపీ సర్కార్ తీవ్రంగా యోచిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ప్రాచుర్యం పొందిన ఈ విధానం, మళ్లీ ఇప్పుడు యుద్ధ పరిస్థితుల కారణంగా తెరపైకి వచ్చింది. ఇటీవల ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పైనా ఉంటుందని, ప్రజలందరూ పొదుపు పాటించాలని సూచించారు. ముఖ్యంగా ఇంధనం వాడకాన్ని తగ్గించడం, అనవసర ప్రయాణాలు మానుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఒక పరిష్కారంగా ప్రస్తావించారు.

ప్రధాని సూచనల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై స్పందించారు. ఏపీలో ప్రభుత్వ రంగంలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో ప్రపంచమంతా ఇంటి నుంచే పనిచేసే రోజులు రాబోతున్నాయని, దానికి అనుగుణంగా మన ఆలోచనా విధానంలో మార్పు రావాలని ఆయన పేర్కొన్నారు. ఇంధన పొదుపు కోసం అనవసర ప్రయాణాలు తగ్గించి, టెలి, వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలుకు సంబంధించిన ప్రతిపాదనలపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి పనిచేసేందుకు వీలున్న విభాగాలు, కార్యాలయాలకు తప్పనిసరిగా హాజరుకావాల్సిన ఉద్యోగులను గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నారు. కొందరికి పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్, మరికొందరికి హైబ్రిడ్ విధానంలో (కొన్ని రోజులు ఇల్లు, కొన్ని రోజులు ఆఫీస్) పనిచేసే అవకాశాన్ని కల్పించే అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై కేబినెట్ సమావేశంలో చర్చించి, స్పష్టమైన మార్గదర్శకాలతో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *