ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా…
విశాలాంధ్ర – రొళ్ల: మండల పరిధిలోని రత్నగిరి గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.గత నెల రోజులుగా కొత్తగా బోరు బావిలో నీరు ఉన్నప్పటికీ, పైపులైన్ సక్రమంగా లేకపోవడం వల్ల కాలనీకి త్రాగునీరు సరఫరా కావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పలుమార్లు అధికారులకు తెలియజేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు.ఈ సమస్యపై వెంటనే స్పందించి పైపులైన్ పనులను పూర్తి చేసి, కాలనీలో త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులను కోరారు.


