Last Updated:
యానం లో ఇండిపెండెంట్ మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ ను భారీ మెజార్టీతో ఓడించిన మల్లాడి, అతనికి ఓటు వేసిన వారిపై సెటైర్లు వేయడంతో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది
యానం అనే ప్రశాంత ప్రాంతంలో ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఈ చిన్న ప్రాంతంలో ఫలితాల తర్వాత గెలిచిన ఎమ్మెల్యే మల్లాడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ఒకవైపు ప్రజల తీర్పును అభినందిస్తూ, ఈ విజయం పూర్తిగా ప్రజలదేనని చెబుతూనే.. మరోవైపు మాజీ ఎమ్మెల్యేకు ఓటు వేసిన వారిపై ఆయన చేసిన ఇండైరెక్ట్ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.
ప్రశాంతతకు మారుపేరైన యానంలో మాజీ ఎమ్మెల్యేకు ఏం చూసి ఓటు వేశారు? అంటూ మల్లాడి ప్రజలనే ప్రశ్నించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. యానాంకు పేకాట క్లబ్బులను తీసుకువచ్చారని ఓటు వేశారా..? కమిషన్లు తీసుకుంటున్నాడని ఓటు వేశారా..? లేక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఓటు వేశారా..? అంటూ వరుస ప్రశ్నలతో ఆయన సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలు నేరుగా కాకపోయినా, మాజీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూనే ఓటర్లను కూడా నిలదీసినట్టుగా కనిపిస్తున్నాయి.
కాకినాడ సమీపంలో ఉన్న యానం ప్రాంతం గతంలో ప్రశాంతతకు చిహ్నంగా ఉండేదని చెప్పిన మల్లాడి.. ఇటీవల పరిస్థితులు ఎలా మారిపోయాయో ప్రజలకే తెలుసని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు ఆ నాయకుడికి మద్దతు ఇచ్చారో ప్రజలే ఆలోచించుకోవాలని సూచించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గతంలో గెలిచిన గొల్లపల్లి అశోక్కు ఈసారి మల్లాడి భారీ మెజార్టీతో చెక్ పెట్టారు. గెలుపు అనంతరం యానంలో భారీ ఊరేగింపులు, డాన్సులతో మల్లాడి అనుచరులు సంబరాలు జరిపారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఈ గెలుపు ప్రజలదే.. ప్రజలకే అంకితం అని స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో మాజీ ఎమ్మెల్యేకు ఓటు వేసిన వారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మల్లాడి మాట్లాడుతూ.. ఇప్పటికే అనేకసార్లు నన్ను గెలిపించిన యానం ప్రజలు ఈసారి కూడా ఆశీర్వదించారు. చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఐదేళ్లలో యానం అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాను అని హామీ ఇచ్చారు. ఇక ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ కూడా తన స్పందనను వెల్లడించారు. గెలుపు, ఓటములు రాజకీయాల్లో సహజం. నా ప్రయాణం ఎప్పటికీ యానం ప్రజలతోనే కొనసాగుతుంది. ఎప్పుడూ వారి మధ్యలోనే ఉంటాను అంటూ ఆయన శాంతంగా స్పందించారు.
మొత్తంగా చూస్తే.. గెలుపు ఆనందం మధ్య మల్లాడి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ప్రజల తీర్పును మెచ్చుకుంటూనే.. అదే ప్రజల ఓటింగ్పై ప్రశ్నలు లేవనెత్తడం ఎంతవరకు సమంజసం అన్నదానిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యానం రాజకీయాలు రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


