విశాలాంధ్ర – నార్పల :- మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామంలో భూమి వివాదం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.
గ్రామానికి చెందిన నాగభూషణ రెడ్డి, నారాయణరెడ్డి మధ్య కొంతకాలంగా భూమికి సంబంధించిన వివాదం కొనసాగుతోంది. శనివారం ఈ వివాదం విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో నాగభూషణ్ రెడ్డి, సాయి భూషణ్ రెడ్డి కలిసి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడిలో నారాయణరెడ్డి భార్య తిరుపాలమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి.గాయపడిన తిరుపాలమ్మను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి వైద్యుల పర్యవేక్షణలో ఉంది.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


