బెంగాల్ సీఎస్గా సీఈసీ మనోజ్కుమార్ అగర్వాల్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల సంఘం బీజేపీ జేబు సంస్థగా వ్యవహరించిందని…ఎసఐఆర్ పేరుతో ప్రతిపక్షాల ఓట్లను తొలగించారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. వీటికి బలం చేకూరుస్తూ తాజాగా సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం…బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) మనోజ్ కుమార్ అగర్వాల్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా ఉన్న దుష్యంత్ నారియాలా… న్యూదిల్లీలో ‘ప్రధాన నివాస కమిషనర’గా నియమితులయ్యారు. ‘పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారిగానూ, హోం, కొండ ప్రాంతాల వ్యవహారాల (ఎన్నికల) శాఖకు పదవి రీత్యా అదనపు ప్రధాన కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్న మనోజ్ కుమార్ అగర్వాల్ను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఉత్తర్వు జారీ చేయడం జరిగింది’ అని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అగర్వాల్ పశ్చిమ బెంగాల్ కేడర్కు చెందిన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎసఐఆర్) ప్రక్రియకు ఆయనే బాధ్యత వహించారు. ఈ ప్రక్రియ ఫలితంగా ఓటర్ల జాబితా నుంచి సుమారు 91 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది.
The post బీజేపీ ‘రిటర్న్ గిఫ్్ట‘ appeared first on Visalaandhra.


